పదవ వార్షిక బోనాల మహోత్సవాలు ప్రారంభం
వైభవంగా అమ్మవారికి బోనాల సమర్పణ, అన్నప్రసాద వితరణ
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మణికంఠ నగర్లో వెలసిన శ్రీశ్రీశ్రీ మద్దెలమ్మ అమ్మవారి దేవాలయంలో పదవ వార్షిక బోనాల మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల సందర్భంగా ఆలయంలో నూతనంగా శ్రీ వరసిద్ధి వినాయక, నందీశ్వర సహిత శివలింగం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని శ్రావణ నక్షత్ర యుక్త తులా లగ్నంలో నయనమనోహరంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం గణపతి పూజ, అఖండ దీపారాధన, ధ్వజారోహణం గావించారు. అనంతరం శాస్త్రోక్తంగా యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, ఆశీర్వచన కార్యక్రమాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా దేవాలయ శాశ్వత వ్యవస్థాపక అధ్యక్షులు గోశిక స్వామి మాట్లాడుతూ..27వ తేదీన శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవస్థానం నుండి మహిళా భక్తులు బోనాలతో బయల్దేరి, బొడ్రాయి చుట్టూ తిరిగి మద్దెలమ్మ అమ్మవారికి సమర్పిస్తారని తెలిపారు. అనంతరం భక్తులందరికీ భారీ అన్నప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అధ్యక్షులు గుర్రం నరసింహ, కార్యదర్శి గోశిక అంజయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షులు బడుగు మోహన్ బాబు, మార్కండేయ స్వామి దేవాలయ అధ్యక్షులు బడుగు ప్రకాష్, ఉపాధ్యక్షులు వనం రాజు, చిక్క నరహరి, సహాయ కార్యదర్శి కందగట్ల ఆనంద్, సుంకి రవికుమార్, గోశిక కరుణాకర్, పిల్లలమర్రి యాదగిరి, గోశిక భాస్కర్, కర్నాటి శ్రీనివాసులు, కడవేరు శంకరయ్య, రుద్ర యాదగిరి, కోడి వనిత, వనం జయశ్రీ, గడ్డం పద్మశ్రీ, గోశిక సత్యనారాయణ, గోశిక రవి, గోశిక వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి