నిబంధనల ఉల్లంఘనలపై ఉక్కుపాదం
నిబంధనల ఉల్లంఘనలపై ఉక్కుపాదం
GADDAM JAGANMOHAN REDDY
త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్కు చెక్ – ఎస్పీ నితిక పంత్ హెచ్చరిక
కొమరం భీమ్ ఆసిఫాబాద్ : జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించే వారిపై ఇకపై ఉక్కుపాదం మోపనున్నట్లు జిల్లా ఎస్పీ నితిక పంత్ స్పష్టం చేశారు. త్రిబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మైనర్లు వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని, మైనర్ వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపైనా కేసు నమోదు చేస్తామని తెలిపారు. బాధ్యతారాహిత్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు సంభవించే అవకాశముందని, ఆ ప్రమాదాలు కుటుంబాలనే కాకుండా ఇతర నిరపరాధుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని పేర్కొన్నారు.
నంబర్ ప్లేట్లలో అక్రమాలకు కఠిన చర్యలు
లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, నంబర్ ప్లేట్ లేకుండా లేదా తప్పుడు నంబర్లతో వాహనాలు నడపడం, ఫ్యాన్సీ డిజైన్లతో నంబర్లు గుర్తించలేని విధంగా ఏర్పాటు చేయడం వంటి చర్యలను సహించబోమని ఎస్పీ స్పష్టం చేశారు. అన్ని వాహన యజమానులు నిబంధనలకు అనుగుణంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అలాగే శబ్ద కాలుష్యానికి కారణమయ్యే విధంగా మార్పులు చేసిన సైలెన్సర్లతో ద్విచక్ర వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
రోడ్డు భద్రతపై అప్రమత్తత అవసరం
మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, రాంగ్ సైడ్ పార్కింగ్, ఓవర్ లోడింగ్ వంటి నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
ప్రజల ప్రాణభద్రత కోసం జిల్లా వ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతాయని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని జిల్లా ఎస్పీ నితిక పంత్ పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి