చైతన్యపురి: నేపాల్లో సంభవించిన భారీ వరదల్లో హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన సుహాసిని రెడ్డి గల్లంతైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మానస సరోవరం యాత్రకు వెళ్లిన ఆమె మంగళవారం రాత్రి నుంచి ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఎల్బీనగర్ పరిధిలోని వాస్తు కాలనీకి చెందిన సుహాసిని రెడ్డి కుటుంబం కొంతకాలంగా అక్కడే నివసిస్తోంది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తికి చెందిన కందిమల్ల మహేందర్రెడ్డి కుమార్తె సుహాసిని ఉన్నత విద్యను అభ్యసించారు. 2004లో మునుగోడు మండలం గూడపూర్కు చెందిన సంజీవరెడ్డితో ఆమెకు వివాహమైంది. దంపతులిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. న్యూజిలాండ్లో కొంతకాలం నివసించిన వారు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్నారు.
మూడు నెలల క్రితమే యాత్రకు బుకింగ్
ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉన్న సుహాసిని ఈ నెల 19న హైదరాబాద్కు వచ్చారు. అనంతరం స్నేహితురాలితో కలిసి మానస సరోవరం యాత్రకు వెళ్లేందుకు మూడు నెలల క్రితమే టికెట్లు బుక్ చేసుకున్నారు. సుహాసిని హైదరాబాద్ నుంచి నేపాల్కు వెళ్లగా, ఆమె స్నేహితురాలు ఆస్ట్రేలియా నుంచి ఖాట్మండుకు చేరుకుంది. ఆదివారం ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు. అనంతరం టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా 29 మంది బృందంతో మానస సరోవరం యాత్రకు బయలుదేరినట్లు సుహాసిని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
మంగళవారం రాత్రి నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్
మంగళవారం రాత్రి 8 గంటల నుంచి సుహాసిని ఫోన్ అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆమె వెళ్లిన ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించినట్లు తెలియడంతో ఆందోళన మరింత పెరిగింది. సుహాసిని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పలువిధాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
యాత్రికుల సమాచారం ఇవ్వాలని వేడుకోలు
మానస సరోవరం యాత్రకు వెళ్లిన సుహాసినితో పాటు ఇతర యాత్రికుల భద్రతపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వం వెంటనే నేపాల్లో ఉన్న మానస సరోవరం యాత్రికుల వివరాలను వెల్లడించి, వారందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి