బ్రిక్స్ అధ్యక్ష దేశంగా భారత్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో రెండు రోజుల పాటు నిర్వహించిన రెండో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యబృంద సమావేశం, ఆస్తుల పునరుద్ధరణపై బ్రిక్స్ నిపుణుల నెట్వర్క్ రెండో సమావేశం బుధవారం విజయవంతంగా ముగిశాయి. కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ (డీవోపీటీ) ఆధ్వర్యంలో ఆగస్టు 4, 5 తేదీల్లో జరిగిన ఈ సమావేశాల్లో బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు, చట్ట అమలు సంస్థలు, ఆర్థిక నిఘా విభాగాల అధికారులు, అవినీతి నిరోధక నిపుణులు పాల్గొన్నారు.
సమావేశాన్ని ప్రారంభించిన కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ కార్యదర్శి రచనా షా అవినీతిని ఏమాత్రం సహించని భారత ప్రభుత్వ విధానాన్ని పునరుద్ఘాటించారు. సుపరిపాలన, ప్రజా విశ్వాసం, సుస్థిరాభివృద్ధికి నైతికత, పారదర్శకత, జవాబుదారీతనం కీలకమని ఆమె పేర్కొన్నారు. అవినీతి నిరోధంలో సాంకేతికత వినియోగంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో సమాచార మార్పిడి, పరస్పర సహకారం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.అవినీతి కేసుల్లో దేశం విడిచి పారిపోయిన నేరగాళ్లను గుర్తించడం, వారి అప్పగింత ప్రక్రియను వేగవంతం చేయడం కోసం బ్రిక్స్ దేశాల చట్ట అమలు నిపుణులతో ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని భారత్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు సభ్య దేశాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. క్షేత్రస్థాయి నిపుణుల మధ్య సమన్వయం పెంపొందించేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటుపై చర్చలు కొనసాగించాలని నిర్ణయించాయి.
అదేవిధంగా, పరారీలో ఉన్న అవినీతి నేరగాళ్ల వివరాలు, సభ్య దేశాల్లో అందుబాటులో ఉన్న అనధికారిక సహకార వ్యవస్థల సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులో ఉంచే బ్రిక్స్ సమాచార నిధి (రిపాజిటరీ) ఏర్పాటును కూడా సభ్య దేశాలు స్వాగతించాయి. ఈ చర్యల ద్వారా అంతర్జాతీయ సహకారం మరింత బలోపేతం కావడంతో పాటు నేరస్తుల గుర్తింపు, అప్పగింత ప్రక్రియలు మరింత వేగవంతం అవుతాయని సమావేశంలో అభిప్రాయపడారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి