రూ.13.50 లక్షల శ్రీరాముడి జ్ఞాపిక.. వేలంలో ప్రత్యేక ఆకర్షణ.
జ్ఞాపికల వేలం ఆదాయం ‘నమామి గంగే’కు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివిధ సందర్భాల్లో అందిన జ్ఞాపికల ఇ-వేలం 8వ ఎడిషన్ గురువారం ప్రారంభమైంది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ వేలాన్ని ప్రారంభించారు. సెప్టెంబర్ 17 నుంచి అధికారిక వెబ్ పోర్టల్ www.pmmementos.gov.in ద్వారా ఇ-వేలం ప్రారంభమైంది.
ఈసారి 1,498 జ్ఞాపికలను వేలానికి ఉంచారు. దేశంలోని కళలు, సంప్రదాయ హస్తకళలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, సాంస్కృతిక వైవిధ్యం, క్రీడా విజయాలను ప్రతిబింబించే వస్తువులు ఇందులో ఉన్నాయి. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం, బిహార్, ఒడిశా నుంచి పెద్ద సంఖ్యలో జ్ఞాపికలను సేకరించినట్లు మంత్రి తెలిపారు.
రూ.13.50 లక్షల శ్రీరాముడి జ్ఞాపిక.
వేలంలో 50 ప్రత్యేక వస్తువులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కర్ణాటకకు చెందిన వెండి శ్రీరాముడి జ్ఞాపికకు రూ.13.50 లక్షల కనీస ధర నిర్ణయించారు. కాకతీయ కళాతోరణం వెండి ప్రతిమకు రూ.9 లక్షలు, ట్రీ ఆఫ్ లైఫ్ గోండ్ ఆర్ట్ పెయింటింగ్కు రూ.7.50 లక్షలు, జగన్నాథ పరివార్ రథానికి రూ.6 లక్షల కనీస ధరగా నిర్ణయించారు.
జ్ఞాపికల వేలం ఆదాయం ‘నమామి గంగే’కు
పీఎం జ్ఞాపికల ఇ-వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని ‘నమామి గంగే’ కార్యక్రమానికి కేటాయించనున్నట్లు షెకావత్ తెలిపారు. భారతీయ కళా, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతోపాటు గంగా నది పునరుజ్జీవనం, సంరక్షణకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.
ప్రజలు, కలెక్టర్లు, సంస్థలు, కళాభిమానులు వేలంలో పాల్గొనాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కోరింది. వేలానికి ముందు జ్ఞాపికలను ప్రత్యేక ప్రదర్శనలో వీక్షించే అవకాశం కల్పించారు. న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ఆధ్వర్యంలో ప్రదర్శన, డాక్యుమెంటేషన్, నిర్వహణ ఏర్పాట్లు చేపట్టారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి