హైదరాబాద్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సు
హైదరాబాద్: రైతుల ఆదాయాన్ని పెంచడం, ఆహార భద్రత, పోషకాహార భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వ్యవసాయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఎలినో ప్రభావం, పంటల వైవిధ్యీకరణ, రబీ సీజన్ సన్నద్ధతపై చర్చించారు.
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చౌహాన్ తెలిపారు. దేశ ప్రయోజనమే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమన్నారు. వ్యవసాయం లేకుండా ప్రపంచం మనుగడ సాగించలేదని పేర్కొన్నారు. యంత్రాలు రొట్టెలు తయారు చేయగలవని.. గోధుమలు మాత్రం పండించలేవని అన్నారు. రైతు అన్నదాత మాత్రమే కాక జీవనదాత అని పేర్కొన్నారు.
దేశంలో 140 కోట్లకుపైగా జనాభాకు ఆహార భద్రత కల్పించడం, రైతుల జీవనోపాధిని మెరుగుపరచడం, ప్రజలకు పోషకాహారం అందించడం వ్యవసాయ రంగం ప్రధాన లక్ష్యాలని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉద్యాన పంటలకు అపార అవకాశాలున్నాయని తెలిపారు. కొబ్బరి, జీడిమామిడి, కోకో, కాఫీ, సుగంధ ద్రవ్యాల సాగును ప్రోత్సహించాలని సూచించారు.
భారత్ కొబ్బరి ఎగుమతులు ఏడాదిలో రూ.4,349 కోట్ల నుంచి రూ.7,038 కోట్లకు పెరిగాయని.. 62 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. పాత కొబ్బరి తోటలను దశలవారీగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. జీడిమామిడి, కోకో రైతులకు అందుబాటులో ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకునేలా రాష్ట్రాలు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేలలు, వాతావరణం, నీటి వనరులు భిన్నంగా ఉన్నందున ఒకే రకమైన వ్యవసాయ ప్రణాళిక సాధ్యం కాదన్నారు. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ప్రాంతీయ వ్యవసాయ సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఉపయోగపడేలా పాత చట్టాలు, నిబంధనల్లో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు.
ప్రపంచ మార్కెట్లు భారత రైతులకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని చౌహాన్ తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో లభిస్తున్న అవకాశాలను రైతులు అందిపుచ్చుకునేలా నాణ్యతా ప్రమాణాలతో పంటలు సాగు చేయాలని సూచించారు.
తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ కింద 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం తొలి విడత నిధులు అందించినట్లు చౌహాన్ తెలిపారు. అర్హులైన పేదలకు తదుపరి దశల్లోనూ ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధి సాధ్యమన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి