రెండేళ్లు దాటిన నమోదులకు కోర్టు ఉత్తర్వులు తప్పనిసరి
పారదర్శకత, నకిలీ ధ్రువపత్రాల నివారణే లక్ష్యం
జనన, మరణ ధృవీకరణ పత్రాల నమోదులో పారదర్శకత పెంచడం, నకిలీ ధ్రువపత్రాల జారీని అరికట్టడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం జననం లేదా మరణం జరిగిన తేదీ నుంచి రెండేళ్లు దాటిన తర్వాత నమోదు చేయాలంటే ఇకపై జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జేఎంఎఫ్సీ) కోర్టు ఉత్తర్వులు తప్పనిసరి కానున్నాయి.
అధికారుల వివరాల ప్రకారం, రెండేళ్లు దాటిన నమోదుల కోసం దరఖాస్తుదారు అఫిడవిట్తో పాటు అవసరమైన ఆధారాలను కోర్టులో సమర్పించాలి. విచారణ అనంతరం జేఎంఎఫ్సీ జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగానే సంబంధిత జనన–మరణ నమోదు అధికారి డిజిటల్ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు.
కొత్త నిబంధనలు ప్రస్తుతం అమల్లో ఉన్న భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్)-2023కు అనుగుణంగా అమలు కానున్నాయి.
ఆలస్యమైన నమోదులకు నిబంధనలు
21 రోజుల లోపు: ఎలాంటి రుసుము లేకుండా నమోదు.
21 నుంచి 30 రోజుల లోపు: నిర్ణీత ఆలస్య రుసుముతో నమోదు.
30 రోజుల నుంచి ఏడాది లోపు: ఆలస్య రుసుముతో పాటు సంబంధిత అధికారుల అనుమతితో నమోదు.
ఒకటి నుంచి రెండేళ్ల లోపు: సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) లేదా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అనుమతితో నమోదు.
రెండేళ్లు దాటితే: జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (జేఎంఎఫ్సీ) కోర్టు ఉత్తర్వులు తప్పనిసరి.
జనన ధ్రువీకరణ పత్రం పాఠశాల ప్రవేశాలు, ఆధార్, పాస్పోర్టు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వారసత్వ హక్కులు వంటి అనేక అవసరాలకు కీలకమైన పత్రం కాగా, మరణ ధ్రువీకరణ పత్రం బీమా, పెన్షన్, ఆస్తి, చట్టపరమైన వ్యవహారాలకు అత్యంత అవసరమని అధికారులు పేర్కొన్నారు.
జననం లేదా మరణం జరిగిన వెంటనే గ్రామ పంచాయతీ, గ్రామ/వార్డు సచివాలయం, మున్సిపాలిటీ లేదా నగర పాలక సంస్థలో నిర్ణీత గడువులో నమోదు చేయించి ధ్రువీకరణ పత్రం పొందాలని అధికారులు ప్రజలకు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి