రెడ్కో డివిజనల్ ఇంజినీర్ అక్రమాస్తులపై ఏసీబీ కొరడా రూ.28 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు.. 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
రెడ్కో డివిజనల్ ఇంజినీర్ అక్రమాస్తులపై ఏసీబీ కొరడా రూ.28 కోట్లకు పైగా ఆస్తుల గుర్తింపు.. 9 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో) ఖైరతాబాద్ డివిజనల్ ఇంజినీర్ ముత్యం వెంకట రమణపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ అవినీతి, అక్రమ మార్గాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో బుధవారం అధికారులు హైదరాబాద్లోని ఆయన నివాసం, కార్యాలయంతో పాటు బంధువులు, సన్నిహితులు, బినామీలకు చెందిన మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో భారీ మొత్తంలో స్థిర, చరాస్తులు బయటపడినట్లు ఏసీబీ వెల్లడించింది. శేరిలింగంపల్లి, కూకట్పల్లిలో నాలుగు నివాస ఫ్లాట్లు, అంజనేయనగర్లో జీ ప్లస్–3 వాణిజ్య భవనం, గుత్తల బేగంపేటలో జీ ప్లస్–5 వాణిజ్య భవనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి అధికారిక విలువ సుమారు రూ.5.95 కోట్లుగా నమోదైనప్పటికీ, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
అదేవిధంగా బ్యాంకు ఖాతాల్లో రూ.52.02 లక్షల నగదు నిల్వలు, 2,094 గ్రాముల బంగారు ఆభరణాలు, కియా, మహీంద్రా, బలెనో కార్లు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా సోదాల్లో గుర్తించారు. అంతేకాకుండా 19 విదేశీ మద్యం సీసాలు, ఒక ఐఎంఎఫ్ఎల్ మద్యం సీసా సహా మొత్తం 20 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంపై మాధాపూర్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక కేసు నమోదు చేసింది.
దర్యాప్తులో మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. నిందితుడు తన భార్య పేరుతో నమోదైన నాలుగు నిర్మాణ సంస్థల ద్వారా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. కూకట్పల్లి మూసాపేట అంజనేయనగర్లో 10 అపార్ట్మెంట్ల నిర్మాణానికి సుమారు రూ.20 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ నిర్మాణాల మార్కెట్ విలువ అధికారిక అంచనాల కంటే మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం గుర్తించిన స్థిర, చరాస్తుల అధికారిక విలువ సుమారు రూ.27.65 కోట్లుగా అంచనా వేస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది. గతంలో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు ఆభరణాల విలువను కలుపుకుంటే మొత్తం ఆస్తుల విలువ రూ.28.14 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇంకా ఇతర ఆస్తుల వివరాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.
ముత్యం వెంకట రమణ గతంలో కూడా ఏసీబీ వలలో చిక్కడం గమనార్హం. 2019 డిసెంబర్ 12న హైదరాబాద్ సైబర్ సిటీ సర్కిల్లో డివిజనల్ ఇంజినీర్ (టెక్నికల్)గా పనిచేస్తున్న సమయంలో ఒక ఫైల్ను ఆమోదానికి పంపేందుకు రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఆ కేసులో ఆయనను 2019 డిసెంబర్ 13న అరెస్టు చేయగా, అనంతరం ఛార్జ్షీట్ కూడా దాఖలైంది. ఆ సమయంలో నిర్వహించిన సోదాల్లో రూ.26.52 లక్షల నగదు, రూ.22.60 లక్షల విలువైన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా అక్రమాస్తుల కేసులో నిందితుడిని హైదరాబాద్లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. కేసుకు సంబంధించి మరిన్ని ఆస్తుల వివరాలు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి