హామీలు కాదు.. డీఎస్సీ కావాలి..! సోమాజిగూడలో అభ్యర్థుల నిరసన
హామీలు కాదు.. డీఎస్సీ కావాలి..! సోమాజిగూడలో అభ్యర్థుల నిరసన
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
టెట్లు నిర్వహిస్తే సరిపోదు.. డీఎస్సీ విడుదల చేయాలి..!
15 వేల టీచర్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో డీఎస్సీ అభ్యర్థుల డిమాండ్
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 15 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డీఎస్సీ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో డీఎస్సీ అభ్యర్థులు విలేకరుల సమావేశం నిర్వహించి ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. పదేపదే టెట్ పరీక్షలు నిర్వహించడం కాకుండా, ఖాళీ పోస్టులను భర్తీ చేసే దిశగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ, గత డీఎస్సీ సమయంలో త్వరలోనే మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటి వరకు ఆ హామీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ విడుదల చేయకుండా వరుసగా టెట్ పరీక్షలు నిర్వహించడం వల్ల నిరుద్యోగ యువతలో తీవ్ర నిరాశ నెలకొందని పేర్కొన్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో పలుమార్లు టెట్ పరీక్షలు నిర్వహించారని, అన్ని టెట్ పరీక్షలను కలిపి చూస్తే95 శాతానికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారని తెలిపారు. అర్హత పొందిన అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం నియామకాల విషయంలో కాలయాపన చేస్తోందని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పోస్టులు భర్తీ కాకపోవడంతో విద్యార్థుల బోధనపై ప్రతికూల ప్రభావం పడుతోందని అభ్యర్థులు పేర్కొన్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయడం అత్యవసరమని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలతో పాటు గురుకుల విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు, మోడల్ స్కూళ్లలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు కూడా ఒకేసారి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అన్ని శాఖల్లోని టీచర్ పోస్టులను సమగ్రంగా గుర్తించి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.
ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఎన్నికల సమయంలో ఉద్యోగాల భర్తీపై చేసిన ప్రకటనలను అమలు చేయాలని అభ్యర్థులు కోరారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో వేలాది మంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిరుద్యోగుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షించవద్దని హెచ్చరించారు.
టీచర్ నియామకాల్లో ఆలస్యం వల్ల ఒకవైపు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుండగా, మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పూర్తి స్థాయి బోధనకు దూరమవుతున్నారని అభ్యర్థులు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి నియామక ప్రక్రియ ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని అభ్యర్థులు స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ విలేకరుల సమావేశంలో డీఎస్సీ అభ్యర్థులు హరీష్, కల్యాణ్, వెంకటేష్, పాండు, సాయి, అరవింద్, సందీప్, శ్రీలత, సుఖన్య, సంధ్యారాణి, మౌనిక తదితరులు పాల్గొని డీఎస్సీ నోటిఫికేషన్ను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి