ఆస్తుల రికవరీ, సీమాంతర అవినీతిపై చర్చలు.
డిజిటల్ యుగంలో అవినీతి నిరోధానికి ఉమ్మడి కార్యాచరణ.
బ్రిక్స్ అధ్యక్ష దేశంగా భారత్కు కీలక ఘట్టం.
బ్రిక్స్–2026కు అధ్యక్షత వహిస్తున్న భారత్ ఆధ్వర్యంలో బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం (ఏసీడబ్ల్యూజీ) రెండో సమావేశం, ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్వర్క్ రెండో సమావేశం ఆగస్టు 4, 5 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్నాయి. కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ఈ సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది.
'స్థిరత్వం–ఆవిష్కరణ–సహకారం–సుస్థిరత కోసం నిర్మాణం' అనే బ్రిక్స్-2026 ప్రధాన ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు బ్రిక్స్ సభ్యదేశాల ఉన్నతాధికారులు, విధాన రూపకర్తలు, అవినీతి నిరోధక సంస్థల ప్రతినిధులు, న్యాయ అమలు సంస్థల అధికారులు హాజరుకానున్నారు. డీవోపీటీ కార్యదర్శి రచనా షా సమావేశాలను ప్రారంభించనున్నారు.
జూన్లో జరిగిన తొలి వర్చువల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై హైదరాబాద్ సమావేశంలో సమీక్ష చేపట్టనున్నారు. సీమాంతర అవినీతి నిరోధం, అక్రమ ఆస్తుల రికవరీ, పారదర్శక పాలన, జవాబుదారీతనం పెంపుపై సభ్యదేశాలు కార్యాచరణను ఖరారు చేయనున్నాయి.
ఆగస్టు 5న 'ఆవిష్కరణ–సాంకేతిక ఆధారిత.
వ్యవస్థల ద్వారా నైతిక పరిపాలన' అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. డిజిటల్ ప్రభుత్వ కొనుగోళ్లు, ఫిన్టెక్, డిజిటల్ ఆస్తుల వల్ల ఏర్పడుతున్న అవినీతి ప్రమాదాల నివారణ, సాంకేతిక ఆధారిత పారదర్శక పాలనపై సభ్యదేశాలు అనుభవాలను పంచుకోనున్నాయి.
భారత్ అధ్యక్షతలో జరుగుతున్న బ్రిక్స్ అవినీతి నిరోధక కార్యాచరణ బృందం చివరి సమావేశం ఇదే కావడంతో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమావేశం ద్వారా అవినీతి నిరోధం, ఆస్తుల రికవరీ, సాంకేతిక ఆధారిత పాలనలో బ్రిక్స్ దేశాల మధ్య దీర్ఘకాలిక సహకారానికి మరింత బలం చేకూరుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి