హైదరాబాద్లో ప్రారంభమైన అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూపు సమావేశం.
పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తులను గుర్తించడం, వారి అప్పగింతకు సహకరించడం, అక్రమ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో బ్రిక్స్ దేశాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా పేర్కొన్నారు.
హైదరాబాద్లో మంగళవారం ప్రారంభమైన బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూపు (ఏసీడబ్ల్యూజీ) రెండో సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఆస్తుల రికవరీపై బ్రిక్స్ నిపుణుల నెట్వర్క్ సమావేశం కూడా నిర్వహిస్తున్నారు.అవినీతి సుస్థిర అభివృద్ధికి ప్రధాన ఆటంకమని రచనా షా పేర్కొన్నారు. ప్రజా వనరులను దుర్వినియోగం చేయడమే కాకుండా ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. అవినీతిని ఏ దేశమూ ఒంటరిగా ఎదుర్కోలేదని, అంతర్జాతీయ సహకారంతోనే సమర్థవంతంగా నియంత్రించవచ్చని స్పష్టం చేశారు.పరారీలో ఉన్న నేరస్తులకు ఏ దేశమూ ఆశ్రయం కల్పించకూడదని, వారి గుర్తింపు, అప్పగింత, అక్రమ నిధుల జాడ కనిపెట్టడం, విదేశాలకు తరలించిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో సభ్య దేశాలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
సాంకేతికత ఆధారిత పరిపాలన అవినీతిని అరికట్టడంలో కీలకమని పేర్కొన్న ఆమె, డిజిటల్ గుర్తింపు, ఈ-సేవలు, డిజిటల్ చెల్లింపులు, పారదర్శక కొనుగోలు విధానాలు, డేటా ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలు అవినీతి అవకాశాలను గణనీయంగా తగ్గిస్తాయని తెలిపారు. గవర్నమెంట్ ఈ-మార్కెట్ప్లేస్ (GeM), ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) వంటి కార్యక్రమాలను ఇందుకు ఉదాహరణగా వివరించారు.సమావేశంలో అవినీతి నిరోధక చర్యలు, అక్రమ ఆస్తుల రికవరీ, చట్ట అమలు సంస్థల మధ్య సమాచార మార్పిడి, సాంకేతికత ఆధారిత నైతిక పరిపాలన అంశాలపై సభ్య దేశాల ప్రతినిధులు విస్తృతంగా చర్చించనున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి