నాణ్యమైన విద్య–ఉచిత వైద్యం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి దామోదర్ రాజనర్సింహ
నాణ్యమైన విద్య–ఉచిత వైద్యం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: మంత్రి దామోదర్ రాజనర్సింహ
Krishna
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం జోగిపేటలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆందోల్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్యతో పాటు సమగ్ర వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని, జిల్లా స్థాయిలోనే 90 శాతం వైద్య సేవలు అందేలా ఆధునిక సదుపాయాలను విస్తరిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన చికిత్స అందించేందుకు ట్రామా, ఎమర్జెన్సీ సేవలను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, మహిళా సంఘాలకు పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాల పథకాలతో పాటు ఇందిరమ్మ క్యాంటీన్లు, సోలార్ యూనిట్లు, పెట్రోల్ బంకులు వంటి అవకాశాలను కల్పిస్తున్నామని వివరించారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా ప్రతి పాఠశాల, కళాశాలలో నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మెరుగైన మౌలిక వసతులు అందిస్తున్నామని, అందోల్ ప్రాంతంలో త్వరలో ఫార్మసీ కళాశాల ఏర్పాటు చేసి నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రూ.200 కోట్ల వ్యయంతో సింగూర్ లైన్ పనులు చేపట్టామని, సింగూర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, సైబర్ క్రైమ్, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి