నల్లగొండలో మార్వాడి వ్యాపారుల ‘నకిలీ’ల దందా!
నల్లగొండలో మార్వాడి వ్యాపారుల ‘నకిలీ’ల దందా!
NM Yadav
బ్రాండెడ్ ముసుగులో కాపీ మాల్ జోరు..
అధికారుల ఉదాసీనతతో కోట్లకు పడగలెత్తిన వ్యాపారం..
నాణ్యత లేని వస్తువులతో వినియోగదారుల నిలువు దోపిడీ..
స్థానిక వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకం.. మొబైల్ అసోసియేషన్ ఆందోళన..
షాపులు రెండు.. జీఎస్టీ ఒక్కటే! మైనర్లతో వెట్టిచాకిరి..
నల్లగొండ : నల్లగొండ జిల్లా కేంద్రం వేదికగా సాగుతున్న ఓ రహస్య వ్యాపార సామ్రాజ్యం స్థానిక వాణిజ్య రంగాన్ని అతలాకుతలం చేస్తోంది. బతుకుతెరువు కోసం రాజస్థాన్ నుంచి వలస వచ్చిన కొందరు మార్వాడీ వ్యాపారస్తులు.. ‘సుంద మార్కెటింగ్ హోల్ సేల్’ పేరిట పూజిత అపార్ట్మెంట్ సందులో గోప్యంగా ఒక షాపు, ఉడిపి హోటల్ ముందర ఇంకొక షాపు నడిపిస్తూ నల్లగొండ నగరాన్ని ఏలే స్థాయికి ఎదిగారు. బ్రాండెడ్ ముసుగులో నాణ్యత లేని ‘దో నెంబర్’ (నకిలీ) మాల్ను విచ్చలవిడిగా విక్రయిస్తూ.. కోట్లాది రూపాయల టర్నోవర్తో పన్నుల దొంగలుగా మారుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అటువైపు కన్నెత్తి చూడని జీఎస్టీ అధికారులు.!
ఇంత పెద్ద ఎత్తున పన్నుల ఎగవేత, అక్రమ వ్యాపారం సాగుతున్నా.. సంబంధిత జీఎస్టీ (GST) అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. బిల్లులు లేని వ్యాపారాలు, నకిలీ బ్రాండ్ల విక్రయాలు బహిరంగంగానే సాగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సదరు వ్యాపారస్తులు తమ ఆర్థిక బలంతో అధికారుల నోళ్లు మూయిస్తున్నారనే విమర్శలు పట్టణంలో బహిరంగగావినిపిస్తున్నాయి.
రూ.50 ఆశ చూపి.. నిలువునా ముంచుతున్నారు!
వినియోగదారుల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఈ దందా సాగుతోంది. బయట మార్కెట్లో స్థానిక వ్యాపారుల వద్ద లభించే రూ. 200 విలువైన వస్తువును.. వీరు కేవలం రూ. 150లకే అందిస్తున్నారు. తక్కువ ధరకు వస్తుండటంతో నాణ్యతను గమనించకుండా వినియోగదారులు ఎగబడుతున్నారు. అయితే, ఈ ‘కాపీ మాల్’ ఎక్కువ కాలం మన్నిక ఉండదు. కొద్ది రోజుల్లోనే అది పాడైపోతుండటంతో వినియోగదారుడు విధిలేక మళ్లీ అదే దుకాణానికి వెళ్లి మరో రూ. 150 పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఒకే వస్తువుపై వినియోగదారులు వందలాది రూపాయలు నష్టపోతూ మోసపోతున్నా.. ఆ నిజాన్ని గ్రహించలేకపోతున్నారు.
స్థానిక వ్యాపారుల మనుగడ ప్రశ్నార్థకం?
ఈ అక్రమ మార్కెటింగ్ దెబ్బకు ఏళ్ల తరబడి నమ్ముకుని వ్యాపారాలు చేస్తున్న స్థానిక వ్యాపారస్తులు తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ వస్తువుల ధరకు తాము ఒరిజినల్ వస్తువులను విక్రయించలేక, ఇటు దుకాణాల అద్దెలు, పన్నులు కట్టలేక స్థానిక దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక వ్యాపారులు సంఘాలుగా ఏర్పడి నిరసన స్వరం వినిపిస్తున్నప్పటికీ.. తగిన కార్యాచరణ లేకపోవడంతో అధికారుల్లో చలనం కరువైంది.
ఈ ముఠా అక్రమాలు కేవలం వ్యాపారానికే పరిమితం కాలేదు. రాజస్థాన్ నుంచి మైనర్ పిల్లలను తెలంగాణకు రప్పించి, చదువుకు దూరం చేసి వారితో వెట్టిచాకిరి చేయిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ బాలకార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్నా కార్మిక శాఖ అధికారులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్థానిక వ్యాపారులు ఏకమై పోరాడాలి.!
నరేందర్ రెడ్డి, ప్రెసిడెంట్, నల్లగొండ మొబైల్ అసోసియేషన్.
వలస వచ్చిన మార్వాడీల అక్రమ వ్యాపారాల వల్ల నల్లగొండలోని స్థానిక వ్యాపార రంగానికి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. సక్రమంగా పన్నులు కడుతూ వ్యాపారం చేసే స్థానికులు వీరి దెబ్బకు అప్పులపాలవుతున్నారు. ఇప్పటికే ఈ పరిస్థితుల వల్ల ఎందరో వ్యాపారులు ఆర్థికంగా కుంగిపోయి, ఆత్మహత్యలకు గురయ్యే పరిస్థితులు వచ్చాయి. ఈ అక్రమ దందాను కట్టడి చేయాలంటే కేవలం అధికారుల పైనే ఆధారపడితే సరిపోదు. స్థానిక వ్యాపారస్తులందరూ ఏకమై, స్వార్థ ప్రయోజనాలకు అతీతంగా గట్టి పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది..
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి