మూడేళ్లలో 191 మంది మృతి కేస్ షీట్ , రికార్డులు స్వాధీనం...
వైద్యుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలపై దృష్టి...
అధిక బిల్లులు, వైద్యుల అర్హతలపై లోతైన విచారణ...
నల్లగొండ : పట్టణంలోని ప్రముఖ ఐకాన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్పై మంగళవారం రాత్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ కె.రాహుల్ నేతృత్వంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి యాజమాన్యంపై వరుసగా వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడి జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గడిచిన మూడేళ్ల కాలంలో ఈ ఆసుపత్రిలో ఏకంగా 191 మంది రోగులు మరణించినట్లు రికార్డుల్లో తేలడం గమనార్హం. మరణాలకు సంబంధించి పూర్తి కేస్షీట్లను, బిల్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలపై దృష్టి
మరణించిన 191 మందికి సంబంధించి అందించిన చికిత్స వివరాలు, వైద్యుల నిర్లక్ష్యం ఉందా లేదా అనే కోణంలో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. హైదరాబాద్ స్థాయిలో ఆసుపత్రి యాజమాన్యం విపరీతంగా బిల్లులు వసూలు చేస్తోందని, దీంతో పలువురు బాధితులు ఆసుపత్రి తీరుపై డీఎంహెచ్ఓకు పిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన కొన్ని సేకరించిన బిల్లుల శాంపిళ్లను అధికారులు పరిశీలన నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రికి రోగుల తరలింపుపై ఆరా..
అధిక బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్న బాధితులను ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పంపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రోజుకు కనీసం 5 నుంచి 6 బెడ్లు ఈ ఆసుపత్రి నుంచి పంపించిన రోగులతోనే నిండుతున్నాయని తెలియడంతో అధికారులు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
అర్హత లేని వైద్యులతో ప్రాక్టీస్?
ఆసుపత్రి ప్రారంభంలో అనుమతుల కోసం చూపించిన వైద్యులు ప్రస్తుతం అక్కడ లేరని తనిఖీల్లో వెల్లడైంది. ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు అర్హత లేని వైద్యులు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారనే సమాచారంతో, ప్రస్తుతం పనిచేస్తున్న వారి విద్యార్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ వివరాలు, విజిటింగ్ వైద్యుల రికార్డులను అధికారులు సేకరించారు.
తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం డీఎంహెచ్ఓ రాహుల్..
"ప్రైవేట్ ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. స్వాధీనం చేసుకున్న రికార్డులు, కేస్షీట్లు, బిల్లులను ల్యాబ్, టెక్నికల్ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఉల్లంఘనలు లేదా వైద్యుల నిర్లక్ష్యం రుజువైతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం."
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి