భారత గ్రంథాలయ శాస్త్రానికి పితామహుడిగా పేరుగాంచిన డాక్టర్ షియాళి రామామ్రిత రంగనాథన్ సేవలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 12న దేశవ్యాప్తంగా గ్రంథపాలకుల దినోత్సవాన్ని (లైబ్రేరియన్స్ డే) నిర్వహిస్తున్నారు. రంగనాథన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
1892 ఆగస్టు 12న అప్పటి మద్రాస్ రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోని షియాళి గ్రామంలో రామామ్రిత అయ్యర్, సీతాలక్ష్మి దంపతులకు రంగనాథన్ జన్మించారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన విద్యాభ్యాసంలో ప్రతిభ కనబరిచారు. గణితశాస్త్రంలో ఉన్నత విద్యను అభ్యసించి కొంతకాలం గణిత ఉపాధ్యాయుడిగా పనిచేశారు.
1924లో మద్రాస్ విశ్వవిద్యాలయంలో గ్రంథపాలకుడిగా బాధ్యతలు స్వీకరించిన రంగనాథన్, అనంతరం లండన్ విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ శాస్త్రాన్ని అభ్యసించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన ఆయన గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి విశేష కృషి చేశారు. మద్రాస్ విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయాల్లో గ్రంథపాలకుడిగా, ప్రొఫెసర్గా సేవలందించారు. 1962లో బెంగళూరులో డాక్యుమెంటేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ను స్థాపించారు.
గ్రంథాలయ శాస్త్రంపై అనేక విలువైన గ్రంథాలను రచించిన ఆయనలో ‘ఫైవ్ లాజ్ ఆఫ్ లైబ్రరీ సైన్స్’, ‘కాలన్ క్లాసిఫికేషన్’, ‘క్లాసిఫైడ్ క్యాటలాగ్ కోడ్’, ‘చైన్ ఇండెక్సింగ్’, ‘ప్రొలెగోమెనా టు లైబ్రరీ క్లాసిఫికేషన్’, ‘థియరీ ఆఫ్ లైబ్రరీ క్యాటలాగ్’, ‘లైబ్రరీ అడ్మినిస్ట్రేషన్’, ‘రిఫరెన్స్ సర్వీస్’ తదితర రచనలు ప్రముఖమైనవి.
గ్రంథాలయ రంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1935లో ‘రావుసాహెబ్’ బిరుదుతో, 1957లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం, పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. భారత ప్రభుత్వం ఆయన గౌరవార్థం పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేసింది. 1965లో ‘నేషనల్ రీసెర్చ్ ప్రొఫెసర్ ఇన్ లైబ్రరీ సైన్స్’గా నియమించింది.
అంతర్జాతీయంగానూ రంగనాథన్ సేవలకు విశేష గుర్తింపు లభించింది. అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ 1970లో ‘మార్గరెట్ మన్ సైటేషన్ ఇన్ కాటలాగింగ్ అండ్ క్లాసిఫికేషన్’ అవార్డుతో సత్కరించింది. అంతర్జాతీయ సమాచార, డాక్యుమెంటేషన్ సంస్థ (FID) ఆయన గౌరవార్థం ‘రంగనాథన్ అవార్డు’ను నెలకొల్పింది. ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్కు ఆయన అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే లైబ్రరీ అసోసియేషన్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్కు జీవితకాల ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
గ్రంథాలయాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు జ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో రంగనాథన్ చేసిన కృషి చిరస్మరణీయమని డా. రాచమల్ల శ్రీను అసిస్టెంట్ ప్రొఫెసర్, గ్రంథాలయ మరియు సమాచార శాస్త్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రామన్నపేట తెలిపారు. ఆయన సేవలను స్మరించుకోవడం గ్రంథపాలకుల దినోత్సవం ఉద్దేశమని పేర్కొన్నారు.1972 సెప్టెంబర్ 27న బెంగళూరులో అనారోగ్యంతో డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ పరమపదించారు. గ్రంథాలయ శాస్త్రానికి ఆయన అందించిన సేవలు నేటికీ ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా నిలిచాయి
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి