రాతికడీలు, కంచె ధ్వంసంపై కేసు నమోదు చేయాలి.
పీఆర్పీఎస్ ఆధ్వర్యంలో చిట్యాలలో ధర్నా.
చిట్యాల: జోగు పార్వతమ్మకు చెందిన అసైన్డ్ భూమిలో రాతికడీలు, కంచెను జేసీబీతో ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని ప్రజా పోరాట సమితి (పీఆర్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్స్వామి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అండతో కాంగ్రెస్ కౌన్సిలర్ భర్త దేశపాక రాజేష్ అరాచకానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
చిట్యాల మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం పీఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు మెమొరాండాలు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్స్వామి మాట్లాడుతూ.. జోగు పార్వతమ్మకు చెందిన ఎకరం అసైన్డ్ భూమిలో ఉన్న రాతికడీలు, కంచెను రాత్రికి రాత్రే జేసీబీతో కూల్చివేశారని, దీంతో సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు.ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా రెండు నెలలుగా కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. రాతికడీలు తామే కూల్చినట్లు కౌన్సిలర్ కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట చెప్పినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. అధికార పార్టీకి చెందినవారికి ఒక న్యాయం, సాధారణ ప్రజలకు మరో న్యాయం ఉండకూడదని పేర్కొన్నారు..అసైన్డ్ భూమిని కాపాడటంతో పాటు బాధ్యులపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులను డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని వెంకట్స్వామి తెలిపారు.
ధర్నాలో పీఆర్పీఎస్ జిల్లా నాయకులు ఉయ్యాల లింగస్వామిగౌడ్, ఏర్పుల లింగస్వామి యాదవ్, మారగోని వెంకన్నగౌడ్, బర్రె సంజీవ, గాదె శ్రీహరి, జోగు శేఖర్, జోగు పార్వతమ్మ, మహంకాళి రమాదేవి, జిట్టా మీనమ్మ, జిట్ట శ్రీకాంత్, మేడి ప్రసాద్, దొండ నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి