నల్గొండలో ఘనంగా దావతే ఇఫ్తార్.. పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి
నల్గొండలో ఘనంగా దావతే ఇఫ్తార్.. పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి
స్థానికం బృందం
ముఖ్యఅతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి – దేశంలో నిజమైన సెక్యులర్ పార్టీ కాంగ్రెస్
నల్గొండ క్లాక్టవర్ సెంటర్లోని మదీనా మసీదులో సోమవారం దావతే ఇఫ్తార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొని వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో నిజమైన సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులమతాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. మైనార్టీ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేశామని గుర్తుచేశారు. నల్గొండలో గత 30 ఏళ్లుగా హిందూ–ముస్లింలు కలిసిమెలిసి పండుగలు జరుపుకుంటూ సౌహార్దాన్ని కాపాడుతున్నారని ప్రశంసించారు. వచ్చే మూడు సంవత్సరాల్లో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మదీనా మసీదు కిరాయిదారులపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాలుగా కిరాయి చెల్లించకుండా జాప్యం చేయడం సరికాదని అన్నారు. మసీదు నిర్వహణకు కిరాయిలు ఎంతో అవసరమని, వక్ఫ్ బోర్డు నియమించిన కమిటీకి కిరాయి చెల్లించాలని సూచించారు. కిరాయి చెల్లించని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డిఆర్వోలను ఆదేశించారు. అవసరమైతే అరెస్టులు చేయాలని ఎస్పీ, డీఎస్పీలకు సూచించారు.
రంజాన్ పండుగ ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన మంత్రి, రాష్ట్ర ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి