మున్సిపాలిటీ ఎన్నికలే లక్ష్యంగా బిజెపి వ్యూహం
మున్సిపాలిటీ ఎన్నికలే లక్ష్యంగా బిజెపి వ్యూహం
Biksham
సంకినేని వెంకటేశ్వరరావు
సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట మున్సిపాలిటీపై బిజెపి జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని బిజెపి రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన బిజెపి మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్తో కలిసి పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ ఎన్నికల కోసం అభ్యర్థుల ఎంపికకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయదలచిన వారు తమ పేర్లను కమిటీకి అందజేయాలని సూచించారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డులలో వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని, పార్టీ కార్యాలయాలను ప్రారంభించి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా స్థాయి నాయకులను వార్డుల ఇన్చార్జీలుగా నియమిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఉచిత రేషన్ బియ్యం అందిస్తోందని, గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపడుతోందని అన్నారు. పట్టణాల్లో అమృత్ పథకం ద్వారా పార్కుల అభివృద్ధి, భూగర్భ డ్రెయినేజీ నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూరుస్తోందని తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతోందన్నారు. సూర్యాపేటకు రైల్వే లైన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సర్వే పూర్తిచేసిందని, త్వరలో పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణకు కూడా కేంద్రం నిధులు ఇస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వార్డు స్థాయిలో, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.ప్రజలు బిజెపిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, నాయకులు ఐక్యంగా పనిచేస్తే మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో మూడు ముక్కలవడం ఖాయమని వ్యాఖ్యానించారు.ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, కర్నాటి కిషన్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లమల్ల నరసింహ, సలిగంటి వీరేంద్ర, రంగరాజు రుక్మారావు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి