మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్
మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలి జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్
Komidala Mahender reddy
స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
నల్గొండ:
జిల్లాలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ కోరారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఎన్నికల షెడ్యూల్తో పాటు తీసుకుంటున్న ఏర్పాట్లను వివరించారు.
జిల్లాలోని మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, హాలియా, చిట్యాల, చండూరు మున్సిపాలిటీలతో పాటు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు అన్ని మున్సిపాలిటీల్లో బుధవారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు చెప్పారు.
ఈ నెల 28 నుంచి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని వెల్లడించారు.
నామినేషన్ల స్వీకరణకు ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేక నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 70 మంది రిటర్నింగ్ అధికారులు, 68 మంది సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ప్రతి ఆర్ఓకు రెండు లేదా మూడు వార్డుల బాధ్యతలు అప్పగించామని, అన్ని కేంద్రాల్లో హెల్ప్డెస్క్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరుగుతుందని, బ్యాలెట్ ముద్రణతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు.
నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచే ఎన్నికల ఖర్చు లెక్కలు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. నామినేషన్ సమయంలో అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని, రెండు వాహనాలకు అనుమతి ఇస్తామని చెప్పారు. మున్సిపాలిటీల్లో జనరల్ అభ్యర్థులకు రూ.2500, ఎస్సీ, ఎస్టీలకు రూ.1550 డిపాజిట్గా చెల్లించాల్సి ఉంటుందని, మున్సిపల్ కార్పొరేషన్లో జనరల్ అభ్యర్థులు రూ.5000, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2500 డిపాజిట్గా నిర్ణయించినట్లు తెలిపారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థులు గరిష్టంగా రూ.1.50 లక్షలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో రూ.1 లక్ష వరకు ఖర్చు చేయవచ్చని పేర్కొన్నారు.
పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ అనంతరం తుది జాబితా ప్రకటించేలోపు ఏ, బి ఫారమ్లు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో మున్సిపాలిటీల్లో బ్యానర్లు, హోర్డింగులు, జెండాలు తొలగించినట్లు తెలిపారు. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు ఇప్పటికే విధుల్లోకి వచ్చాయని, ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మాత్రమే ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు.
జిల్లాలో మొత్తం 3,09,097 మంది ఓటర్లు ఉండగా, 162 వార్డులు, 475 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్కు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. పోలింగ్ రోజున 100 మీటర్ల పరిధిలో బీఎంఎస్ ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలకు ఎలాంటి అవకాశం లేదని హెచ్చరించారు. పోలింగ్, కౌంటింగ్ రోజున ఏజెంట్ల నియామకానికి సంబంధించిన వివరాలను ముందుగానే సమర్పించాలని సూచించారు.
జిల్లాకు జనరల్ అబ్జర్వర్గా రాష్ట్ర ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ను రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించినట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఫిర్యాదుల కోసం జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 1442కు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ, ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమన్నారు. నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు ఎన్నికల నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ప్రచారం, ర్యాలీలకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని సూచించారు. ర్యాలీల రూట్, పాల్గొనేవారి సంఖ్యను ముందుగానే పోలీసులకు తెలియజేయాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య వార్తలను నమ్మవద్దని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి