మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన భద్రత
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన భద్రత
Biksham
350 మంది పోలీసులతో బందోబస్తు – నిషేధాజ్ఞలు అమలు – విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 350 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ కె నరసింహ తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రం శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని వెల్లడించారు.ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
నేర నిరోధక చట్టం ప్రకారం నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నామని, ఈ ఆజ్ఞలు రేపు ఉదయం 6 గంటల నుండి శనివారం ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.లెక్కింపు కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులు, ప్రతినిధులు నిషేధిత వస్తువులు తీసుకురాకూడదని సూచించారు.
అగ్గిపెట్టెలు, లైటర్లు, సిరా సీసాలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన వస్తువులు అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు.ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
గెలిచిన అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లెక్కింపు కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు, వేగవంత ప్రతిస్పందన బృందాలు, శునక దళం, బాంబు నిర్వీర్య దళం, దాడి నిరోధక బలగాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ప్రజలందరూ శాంతి, సామరస్య వాతావరణాన్ని కాపాడుతూ ఫలితాలను పరస్పర గౌరవంతో స్వీకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి