Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 07:10 PM

ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి పరిశోధన సదస్సు

ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి పరిశోధన సదస్సు

ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి పరిశోధన సదస్సు
February 07, 2026 05:52 AM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

పరిశోధన నాణ్యత పెంపుకు కృత్రిమ మేధ సాధనాలు దోహదం – నిపుణుల అభిప్రాయం

ములుగు జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిశోధన రంగానికి నూతన దిశ చూపేలా రెండు రోజుల పాటు జాతీయ స్థాయి సదస్సు ఘనంగా జరిగింది. “పరిశోధనలో ఉత్తమత సాధన – అకాడమిక్ రచన, ప్రచురణలో కృత్రిమ మేధ సాధనాల వినియోగం” అనే అంశంపై నిర్వహించిన ఈ సదస్సుకు వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రముఖులు హాజరై తమ అనుభవాలు పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సమ్మక్క సారలక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం డీన్ (అకాడమిక్స్) ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి మాట్లాడుతూ, పరిశోధన రంగంలో కృత్రిమ మేధ సాధనాల వినియోగం వేగవంతమైన ఫలితాలు అందించగలదని అన్నారు. అయితే పరిశోధకులు నైతిక విలువలు, అకాడమిక్ సమగ్రతను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సాంకేతికత సహాయక సాధనమే గాని ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు.కీలక ప్రసంగం చేసిన కాకతీయ విశ్వవిద్యాలయం వాణిజ్య, వ్యాపార నిర్వహణ విభాగానికి చెందిన బోర్డ్ ఆఫ్ స్టడీస్, విద్యా మండలి సభ్యురాలు ప్రొఫెసర్ పి. వరలక్ష్మి మాట్లాడుతూ, పరిశోధన రచన, పరిశోధనా పత్రాల ప్రచురణలో ఆధునిక డిజిటల్ సాధనాల పాత్రను వివరించారు. నాణ్యమైన పరిశోధన పత్రాలు రూపొందించడంలో పరిశోధకులు సమయానుకూలంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.ప్రత్యేక అతిథిగా పాల్గొన్న కాకతీయ విశ్వవిద్యాలయం గ్రంథాలయ శాస్త్ర విభాగాధిపతి, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్ డాక్టర్ బి. రాధికా రాణి మాట్లాడుతూ, పరిశోధనలో సమాచార వనరుల ఎంపిక, ఉల్లేఖన పద్ధతులు, అనుకరణ నివారణలో ఆధునిక సాధనాల వినియోగంపై అవగాహన కల్పించారు. పరిశోధన విశ్వసనీయతకు ఇవి ఎంతో కీలకమని తెలిపారు.ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. మల్లేశం మాట్లాడుతూ, ఆధునిక పరిశోధనలో సాంకేతిక సాధనాల ప్రాముఖ్యత రోజురోజుకు పెరుగుతోందని అన్నారు. విద్యార్థులు, పరిశోధకులు నైతిక ప్రమాణాలను కాపాడుకుంటూ కొత్త పరిజ్ఞానాన్ని స్వీకరించాలని సూచించారు. ఇలాంటి జాతీయ స్థాయి సదస్సులు పరిశోధనా నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమానికి కన్వీనర్‌గా కళాశాల గ్రంథపాలకులు డాక్టర్ బి. జగదీష్, సహ కన్వీనర్‌గా వాణిజ్య విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్. భాస్కర్, నిర్వహణ కార్యదర్శిగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. శిరీష వ్యవహరించారు. సదస్సు లక్ష్యాలు, ప్రాధాన్యతను వారు వివరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News