మినీ ట్యాంక్ బండ్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం
మినీ ట్యాంక్ బండ్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం
Vikram
సద్దుల చెరువు వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :
సూర్యాపేట సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ను ప్రజలు సేదతీరేలా, ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతిబింబించే విధంగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద గురువారం నిర్వహించిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సూర్యాపేటను ఒక ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతోనే మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ట్యాంక్ బండ్కు సంబంధించిన పనులు నిలిచిపోయాయని, ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి రూ.5 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ సుందరికరణ పనులను చేపట్టిందని పేర్కొన్నారు. ఈ పనులను ఆరు నెలల లోపు పూర్తిచేసి, ప్రజలకు ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
మినీ ట్యాంక్ బండ్ వద్దకు వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా క్యాంటీన్, నడక మార్గం, దీపాల ఏర్పాటు, విశ్రాంతి ప్రదేశాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.
తాను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రత్యేకంగా రూ.1 కోటి అంచనా వ్యయంతో 80 సీట్ల శీతలీకరణ బోటును మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ బోటు నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, నెలలోపు పూర్తిచేసి పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ బోటును పుట్టినరోజు వేడుకలు, చిన్న కార్యక్రమాలు, చెరువు మధ్య ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
అదేవిధంగా సద్దుల చెరువు పరిసర ప్రాంతంలోని సుమారు ఐదు ఎకరాల పార్క్ స్థలంలో రూ.15 కోట్లతో అంతర్జాతీయ స్థాయి పార్క్ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ పార్క్కు త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అవసరమైతే మరో రూ.10 కోట్లు అదనంగా వెచ్చించి, ట్యాంక్ బండ్, ఐలాండ్ పార్క్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
పిల్లలతో కుటుంబ సమేతంగా వచ్చే వారికి వినోదంగా గడిపేలా ఆటల ప్రాంగణం, చిన్న నాట్యశాల వంటి ప్రత్యేక ఆకర్షణలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధి పనుల ద్వారా సూర్యాపేటను పర్యాటక రంగంలో ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సూర్యాపేట పర్యాటక అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసినందుకు పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ముదిరెడ్డి రమణారెడ్డి, డా. వూర రామ్మూర్తి యాదవ్, వెలుగు వెంకన్న, ఫరూక్, దొంతిరెడ్డి సైదిరెడ్డి, ధర్మానాయక్, పర్యావరణ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి