మార్చి 31న రామన్నపేటలో మహిళా రైతుల రాష్ట్ర సదస్సు – జయప్రదం చేయాలి
మార్చి 31న రామన్నపేటలో మహిళా రైతుల రాష్ట్ర సదస్సు – జయప్రదం చేయాలి
స్థానికం బృందం
రామన్నపేట:
మార్చి 31న రామన్నపేట మండల కేంద్రంలో నిర్వహించనున్న రైతు సంఘం మహిళా రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో రాష్ట్ర సదస్సుకు సంబంధించిన గోడపత్రికను ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పగించేలా పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే విత్తన బిల్లు, మార్కెట్ ముసాయిదా బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు తీసుకొచ్చారని విమర్శించారు. గతంలో రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా, ఉన్న అవకాశాలను కూడా దూరం చేస్తున్నారని అన్నారు.
పంట నాట్లు వేసినప్పుడే ఇవ్వాల్సిన రైతు భరోసా పంట కోతకు వచ్చినప్పటికీ అందడం లేదని, వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా రైతులకు భూమిపై హక్కులు కల్పిస్తూ జాయింట్ పట్టాలు ఇవ్వాలని కోరారు.
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలులోకి రావడం లేదని, పెట్టుబడి సహాయం అందక మహిళా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కౌలు రైతుల్లో కూడా మహిళల సంఖ్య గణనీయంగా ఉందని పేర్కొన్నారు. పాలు, పండ్లు, కూరగాయలు, చేపలు, కోళ్ల పెంపకంలో మహిళల పాత్ర కీలకమైందని, ఈ రంగాల్లో మహిళలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి బోయిని ఆనంద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జల్లెల పెంటయ్య, బల్గూరి అంజయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు బొడ్డుపల్లి వెంకటేశం, వేముల సైదులు, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి