మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం – రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరు
మార్చి 14 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం – రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరు
Komidala Mahender reddy
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్న ఈ పరీక్షలకు మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులు ఇప్పటికే ముమ్మరంగా సన్నద్ధమవుతున్నారు. విద్యార్థుల హాల్టికెట్లు విడుదల చేయగా, మీ సేవ కేంద్రాల ద్వారా అలాగే 8096958096 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఈ పరీక్షల్లో రెగ్యులర్ విద్యార్థులు 5,17,727 మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి 2,07,573 మంది, గురుకులాల నుంచి 60,139 మంది, ప్రైవేట్ మరియు ఎయిడెడ్ పాఠశాలల నుంచి 2,50,015 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సులభంగా చేరుకునేందుకు హాల్టికెట్లపై క్యూఆర్ కోడ్ను ముద్రించారు. మొబైల్ ఫోన్తో స్కాన్ చేస్తే పరీక్షా కేంద్రానికి వెళ్లే మార్గం మ్యాప్లో ఆటోమెటిక్గా కనిపించేలా ఏర్పాటు చేశారు.
విద్యార్థులు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా సూచించారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల ముందు తెరవాలని అధికారులు నిర్ణయించారు.పదో తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో కీలక మైలురాయిగా నిలుస్తాయని పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. పాఠ్యాంశాలను బాగా చదివి అర్థం చేసుకుని రాస్తే అవి దీర్ఘకాలం గుర్తుంటాయని, పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి