Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 13, 2026 04:11 PM

మైనర్ బాలికపై అత్యాచారం కేసు: ముద్దాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం

మైనర్ బాలికపై అత్యాచారం కేసు: ముద్దాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం

మైనర్ బాలికపై అత్యాచారం కేసు: ముద్దాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం
March 13, 2026 10:15 AM 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కడప: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ వైఎస్ఆర్ కడప జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అలాగే బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

జమ్మలమడుగు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 476/2021గా నమోదైన ఈ కేసులో, సుగుమంచిపల్లి గ్రామానికి చెందిన బీఎస్ మహమ్మద్ భాష (41) అనే వ్యక్తి గ్రామానికి చెందిన మైనర్ బాలికను మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2021 డిసెంబర్ 13న ఇంటి నుంచి తీసుకెళ్లాడు. అనంతరం హంసలకోన ప్రాంతంలో పసుపు తాడు కట్టి వివాహం చేసినట్లు నటించి బాలికపై బలవంతంగా లైంగిక దాడి చేశాడు.

తర్వాత ఇద్దరూ అనంతపురం వెళ్లి అక్కడ బిందెల ఫ్యాక్టరీ కాలనీలో అద్దె ఇంటిలో నివసిస్తూ, బాధితురాలిని తన భార్యగా పరిచయం చేసుకున్నాడు. ఈ సమయంలో బాధితురాలి తల్లిదండ్రులు జమ్మలమడుగు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. విషయం తెలిసిన ముద్దాయి బాధితురాలిని తిరిగి జమ్మలమడుగులో వదిలిపెట్టి పరారయ్యాడు. ఇంటికి చేరిన బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు వివరించింది.

ఈ కేసును అప్పటి సీఐ వెంకటేశ్వర్లు నమోదు చేయగా, అప్పటి జమ్మలమడుగు ఎస్‌డీపీవో ఎం. నాగరాజు విచారణ జరిపి ముద్దాయిని అరెస్టు చేసి చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.

కడప పోక్సో కోర్టులో విచారణ జరిపిన గౌరవ న్యాయమూర్తి టి. కేశవ సాక్ష్యాలను పరిశీలించి నేరం రుజువుకావడంతో పోక్సో చట్టం ప్రకారం ముద్దాయికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్ ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించారు. విచారణ సమయంలో సాక్షులను సమయానికి కోర్టులో హాజరు పరిచిన ప్రస్తుత జమ్మలమడుగు సీఐ, కోర్టు మానిటరింగ్ ఏఎస్ఐ నాగేంద్ర, కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఎస్. మహబూబ్ బాషాలను జిల్లా ఎస్పీ సెల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News