మధిర మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
మధిర మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం
Biksham
అభివృద్ధి ఫలితమే ప్రజా తీర్పు – ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు బ్రహ్మరథం
మధిర పట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. పట్టణంలోని 21 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేశారు. ఈ విజయం మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఇచ్చిన మద్దతుగా పార్టీ నాయకులు అభివర్ణించారు.మధిర పట్టణ అభివృద్ధికి తీసుకున్న పలు సంక్షేమ, మౌలిక సదుపాయాల చర్యల పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారని, అదే ఈ ఎన్నికల్లో ప్రతిఫలించిందని నాయకులు పేర్కొన్నారు. పట్టణంలో రహదారులు, కాలువలు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ సౌకర్యాలు వంటి అంశాల్లో జరిగిన అభివృద్ధి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిందన్నారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జిగా సమర్థవంతంగా పనిచేసిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ శాసనసభ్యుడు కొండబాల కోటేశ్వరరావు సేవలను పార్టీ నాయకులు ప్రత్యేకంగా కొనియాడారు. వారి కృషి ఫలితంగానే పార్టీ ఘన విజయం సాధించిందని తెలిపారు.
కాంగ్రెస్ న్యాయ విభాగం చైర్మన్ వాసంశెట్టి కోటేశ్వరరావు, మధిర మాజీ సర్పంచ్ వాసంశెట్టి లక్ష్మీప్రియ, ఉన్నత న్యాయస్థాన న్యాయవాది చెరుకూరి శేషగిరి రావు, శీలం చెన్నారెడ్డి, మాజీ సహకార సంఘం అధ్యక్షుడు కటికల సీతారామిరెడ్డి తదితరులు రాయల నాగేశ్వరరావు, కొండబాల కోటేశ్వరరావులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 21 వార్డుల్లో గెలిచిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ వార్డు సభ్యులను నాయకులు అభినందించారు.పట్టణ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతామని, అభివృద్ధి పథంలో మధిరను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి