లోక్ అదాలత్తో వివాదాలకు శాశ్వత పరిష్కారం – ప్రజలకు ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపు
లోక్ అదాలత్తో వివాదాలకు శాశ్వత పరిష్కారం – ప్రజలకు ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపు
Krishna
ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పిలుపునిచ్చారు. క్షణికావేశంలో జరిగిన సంఘటనలు, చిన్నచిన్న వివాదాల కారణంగా నమోదైన కేసులను పరస్పర అవగాహనతో రాజీ ద్వారా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని ఆయన తెలిపారు. జిల్లాలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాలు అంగీకారంతో రాజీ కుదుర్చుకోవడం ద్వారా సమయం, ధనం, శ్రమ ఆదా కావడంతో పాటు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన కేసులు, కుటుంబ మరియు వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ తదితర కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. జాతీయ లోక్ అదాలత్ విజయవంతం కావడానికి పోలీసు అధికారులు, సిబ్బంది రాజీ పడదగిన కేసుల్లో కక్షిదారులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించేలా కృషి చేయాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వివాదాలకు ముగింపు పలికి సామరస్యపూర్వక వాతావరణాన్ని నెలకొల్పాలని జిల్లా ఎస్పీ కోరారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి