లారీని ఢీకొట్టిన ఎర్టిగా కార్: సూర్యాపేట యువకుడు దుర్మరణం!
లారీని ఢీకొట్టిన ఎర్టిగా కార్: సూర్యాపేట యువకుడు దుర్మరణం!
K.RAVI
కోయలగూడెం బ్రిడ్జి వద్ద ఘోర ప్రమాదం
సిగ్నల్స్ లేకుండా రోడ్డుపై ఆపిన డీసీఎం లారీనే కాలయముడు
జాతీయ రహదారి 65పై బుధవారం సాయంత్రం జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...సూర్యాపేట జిల్లా, చివ్వేంల మండలం, బధ్య తండాకు చెందిన లంబాడి సామాజిక వర్గానికి చెందిన బానోతు మల్లేష్ (35) (తండ్రి: రెడ్యా) వృత్తిరీత్యా డ్రైవర్. బుధవారం తన ఎర్టిగా కారు (TG 26T 1119) లో కిరాయి ప్యాసింజర్లను హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో డ్రాప్ చేశాడు. అనంతరం తిరిగి సూర్యాపేట వైపు ప్రయాణమయ్యాడు.మార్గమధ్యలో చౌటుప్పల్ పరిధిలోని కోయలగూడెం బ్రిడ్జి వద్దకు రాగానే, అప్పటికే రోడ్డుపై రిపేరు వచ్చి ఆగి ఉన్న ఒక డీసీఎం లారీని (AP 24 TG 1529) మల్లేష్ నడుపుతున్న ఎర్టిగా కారు వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.రోడ్డుపై ఆగి ఉన్న డీసీఎం లారీ డ్రైవర్ వాహనానికి సంబంధించి ఎటువంటి ప్రమాద హెచ్చరిక సిగ్నల్స్ (ఇండికేటర్స్ లేదా రిఫ్లెక్టర్స్) పెట్టకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల సమయంలో వెలుతురు తగ్గుతున్న క్రమంలో, ఆగి ఉన్న లారీని గమనించలేకపోవడంతో కారు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జవ్వగా, మల్లేష్ తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే చౌటుప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని కారులో నుండి బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైన డీసీఎం లారీపై కేసు నమోదు చేశామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి