కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై రాజ్యాధికార పార్టీ ఆగ్రహం
కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై రాజ్యాధికార పార్టీ ఆగ్రహం
Biksham Goud
బీసీలకు ప్రత్యేక అట్రాసిటీ చట్టం తీసుకురావాలి – తీన్మార్ మల్లన్న డిమాండ్
మార్చి 2న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు పిలుపు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సమాజంపై కొనసాగుతున్న దాడులకు నిరసనగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
బీసీలపై అనేక దాడులు జరుగుతున్నాయని, వాటిలో కొన్నే వెలుగులోకి వస్తున్నాయని, మరెన్నో ఘటనలు బయటపడడం లేదని అన్నారు. కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘటన సామాజిక మాధ్యమాల ద్వారా తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. కనీస సదుపాయాలు లేని పరిస్థితుల్లో ఇలాంటి ఘటన జరగడం ఆందోళనకరమని, భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. ఈ తరహా సంఘటనలకు శాశ్వత పరిష్కారం అవసరమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అట్రాసిటీ చట్టం తీసుకొచ్చిన నేపథ్యంలో, తెలంగాణలో కూడా బీసీలకు రక్షణగా ప్రత్యేక అట్రాసిటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉన్నట్లే బీసీలకు కూడా చట్టపరమైన రక్షణ అవసరమని అన్నారు. కుమ్మెర జాతర ఘటనలో రెండు నెలల పసిపాప మరణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దీనికి కారణమైన వారిపై హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితులను వదిలిపెడితే పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. పోలీసుల వ్యవహారంపై కూడా విమర్శలు గుప్పించారు. ఒక వర్గం ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, బాధితుల ఫిర్యాదును పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తక్షణమే బీసీలకు అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలని, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఇందిరాపార్క్ వద్ద మార్చి 2వ తేదీన మహాధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అన్ని వర్గాల బీసీలు, ప్రజాప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొని బీసీ రక్షణ చట్టం కోసం గళం వినిపించాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి