కుమ్మెర ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి
కుమ్మెర ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలి
Biksham Goud
పసిబిడ్డ హంతకులపై వెంటనే కేసులు నమోదు చేయాలి – తల్లమల్ల హసేన్ డిమాండ్
అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఫిబ్రవరి 18న మల్లన్న జాతర సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో రెండు నెలల పసిబిడ్డ మృతి చెందిన నేపథ్యంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది తల్లమల్ల హసేన్ డిమాండ్ చేశారు. జాతర సందర్భంగా దేవుని దర్శనానికి వెళ్లిన సిలికేశ్వరం గణేష్ కుటుంబ సభ్యులను కులం పేరుతో దూషించి దాడి చేసి, దౌర్జన్యానికి పాల్పడి పసిబిడ్డను హత్య చేశారని ఆరోపించారు. మహిళలను అవమానించడంతో పాటు, ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించిన గణేష్ను నిర్బంధించి తీవ్రంగా కొట్టినట్లు తెలిపారు. ఘటన జరిగి వారం రోజులు గడిచినా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోవడం విచారకరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే కులదాడులు జరగడం బాధాకరమని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఈ ఘటనను ఖండిస్తూ శుక్రవారం ఉదయం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు, కేవిపిఎస్ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ నిరసనలో కేవిపిఎస్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి, తెలంగాణ మాదిగ జన సమితి అధ్యక్షుడు ఊట్కూరు సైదులు మాట్లాడుతూ కుమ్మెర ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి నిందితులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో మాల మహానాడు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బోల్లెద్దు వినయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల నరసయ్య, జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు నామా వేణు, రాష్ట్ర కార్యదర్శి కాశిమల్ల వెంకట నరసయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు, జిల్లా ఉపాధ్యక్షుడు పులుసు సత్యం, సిఐటియు నాయకుడు మామిడి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. నిందితులపై వెంటనే హత్య కేసు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి