కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలి
కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలి
Editor Desk
నల్గొండ,: జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని, ఈ ఫీజుల దోపిడీని అరికట్టేందుకు విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి పి. సుసింధర్రావుకు డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు, యూనిఫాంలు, షూస్ తదితర వస్తువులను కూడా విద్యాసంస్థల ద్వారానే అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన ప్రతిసారి తల్లిదండ్రులు లక్షల రూపాయల భారం మోస్తూ అప్పుల పాలవుతున్న పరిస్థితి నెలకొందని అన్నారు.
విద్యను సేవా రంగంగా కాకుండా వ్యాపారంగా మార్చి లాభాపేక్షతో వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం రూపొందించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని కోరారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి, జిల్లా నాయకులు ఎండీ బేగ్, అమనగంటి హరీష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి