దేవలమ్మ నాగారం చెరువు భూముల ఆక్రమణ: సర్పంచ్ సురుగు గౌరి శ్రీనివాస్
దేవలమ్మ నాగారం చెరువు భూముల ఆక్రమణ: సర్పంచ్ సురుగు గౌరి శ్రీనివాస్
K.RAVI
సర్వే నంబర్ 379, 380 లలో 10 ఫీట్ల ఎత్తున మట్టి పోత
అధికారులు పట్టించుకోవడం లేదని పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తుల ఆగ్రహం
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలోని చెరువు భూములు యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతున్నాయని స్థానిక సర్పంచ్ సురుగు గౌరి శ్రీనివాస్ ఆరోపించారు. మంగళవారం ఆమె స్థానిక పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులతో కలిసి చెరువు పరిధిలోని సర్వే నంబర్ 379, 380 లలో మట్టి పోసి ఆక్రమిస్తున్న ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొంతమంది రైతులు చెరువు గర్భంలో సుమారు 10 ఫీట్ల ఎత్తున మట్టిని పోస్తూ, మల్లు అచ్చుపడుతూ అక్రమంగా ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ విషయమై ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు సురుగు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గత 15 రోజులుగా చెరువులో యథేచ్ఛగా మట్టిని తరలిస్తూ పూడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున అంతర్నాటకం నడుస్తోందని ఆరోపించారు."అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తే.. వారు నామమాత్రంగా వచ్చి చూసి వెళ్తున్నారే తప్ప, అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులే ఆక్రమణదారులను వెనకేసుకొస్తూ, వారిని ప్రోత్సహిస్తున్నారు."చెరువు గర్భంలో భారీగా మట్టిని కుమ్మరించడం వల్ల నీటి సాంద్రత తగ్గిపోవడమే కాకుండా, రాబోయే వర్షాకాలంలో చెరువు కట్టకు గండి పడే ప్రమాదం ఉందని శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, చెరువు భూముల ఆక్రమణలను తక్షణమే అడ్డుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి