కన్నుల పండుగగా శ్రీరాముల కళ్యాణ మహోత్సవాలు
కన్నుల పండుగగా శ్రీరాముల కళ్యాణ మహోత్సవాలు
Biksham
వాడవాడలో ఘనంగా నిర్వహణ – జై శ్రీరామ నినాదాలతో మారుమోగిన సూర్యాపేట
సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. పట్టణంలోని అనేక దేవాలయాలు, కాలనీలు, వార్డులలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తులు జై శ్రీరామ నినాదాలతో భక్తి పరవశంలో పాల్గొన్నారు.
శ్రీ వేదాంత భజన మందిరంలో 74వ వార్షికోత్సవం సందర్భంగా స్వామి అమ్మవార్లను ప్రత్యేక మండపంలో పట్టు వస్త్రాలతో అలంకరించి వేద మంత్రాల నడుమ వేద బ్రాహ్మణులు కళ్యాణ తంతు నిర్వహించారు. అనంతరం భక్తులు పెద్ద ఎత్తున దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.
పట్టణంలోని శ్రీ కార్యసిద్ధి సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో కూడా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి విశేష పూజలతో కళ్యాణం నిర్వహించారు.
నల్లాలబాయి చౌరస్తాలో మార్గదర్శి యువక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలు భక్తులను ఆకట్టుకున్నాయి. సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక మండపంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు.
రాయినిగూడెం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు.
స్నేహ నగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో కూడా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేసి కళ్యాణ తంతును నిర్వహించారు.
శ్రీరామ్ నగర్లోని విజయ ఆంజనేయ స్వామి దేవాలయంలో వేలాదిమంది భక్తుల సమక్షంలో కళ్యాణ మహోత్సవం జరిగింది. భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ప్రజలు స్వామివారి ఆశీస్సులు పొందారు.
విద్యానగర్ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించగా, 13వ వార్డులోని సంజీవని ఆంజనేయస్వామి దేవస్థానంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణం నిర్వహించారు.
మొత్తం మీద సూర్యాపేట పట్టణం అంతా శ్రీరామ నామస్మరణతో మారుమోగి, భక్తి భావంతో నిండిపోయింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి