కన్నతల్లినే కడతేర్చిన కుమార్తె.. ఇంట్లోనే పాతిపెట్టి సిమెంటుతో పూడ్చివేత
కన్నతల్లినే కడతేర్చిన కుమార్తె.. ఇంట్లోనే పాతిపెట్టి సిమెంటుతో పూడ్చివేత
Prabhakar
ప్రేమకు అడ్డుందని ఘాతుకం.. జవహర్నగర్ హత్య కేసు మిస్టరీ వీడింది
జవహర్నగర్,
నవమాసాలు మోసి, కని పెంచిన కన్నతల్లి అని కూడా చూడకుండా.. ప్రేమించిన వాడితో కలిసి ఓ కుమార్తె చేసిన ఘాతుకం సమాజాన్ని నివ్వెరపరిచింది. తన ప్రేమకు అడ్డు పడుతోందని కన్నతల్లిని కత్తితో పొడిచి చంపి, ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే పాతిపెట్టిన అమానుష ఘటన జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం మల్కాజిగిరి జోన్ డీసీపీ శ్రీధర్ ఈ కేసు వివరాలను వెల్లడించారు.
ప్రేమ చిచ్చు.. పోక్సో కేసులు:
పోలీసుల కథనం ప్రకారం.. కౌకూర్ భరత్నగర్కు చెందిన అంజు (40) వృత్తిరీత్యా పనిమనిషి. ఆమె చిన్న కుమార్తె (17) ఇంటర్ చదువుతున్న సమయంలో బీహార్కు చెందిన డ్రైవర్ మోంటీ కుమార్ సింగ్తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో తల్లి అంజు తీవ్రంగా వ్యతిరేకించింది. బాలిక మైనర్ కావడంతో గతంలో మోంటీపై రెండుసార్లు పోక్సో (POCSO) కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లి వచ్చినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదు.
పక్కా పథకం ప్రకారం..:
తల్లి అడ్డు తొలగించుకోవాలని పథకం వేసిన నిందితులు.. గత ఏడాది మే 12న ఘాతుకానికి ఒడిగట్టారు. ఇంట్లో నక్కి ఉన్న మోంటీ, బాలిక సంకేతం ఇవ్వగానే అంజుపై దాడి చేశాడు. కుమార్తె తల్లిని గట్టిగా పట్టుకోగా, మోంటీ కత్తితో ఆమె గుండెల్లో పొడిచి ప్రాణాలు తీశాడు. అనంతరం మృతదేహాన్ని బెడ్ కింద దాచి, రక్తం మరకలు తుడిచేశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఇంట్లోనే గుంత తీసి మృతదేహాన్ని పూడ్చిపెట్టి, పైన సిమెంటు, ఇసుకతో పక్కాగా పూడ్చివేశారు. ఎలుకల వల్ల నేల పాడైందని నమ్మించి రిపేరు చేయించారు.
అదృశ్యం కేసుతో మొదలై..:
తల్లి కనిపించడం లేదంటూ పెద్ద కుమార్తె రోషిణి అక్టోబర్ 2025లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 'మహిళ అదృశ్యం' కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా మోంటీని విచారించగా అసలు నిజం బయటపడింది. హత్య తర్వాత నిందితులిద్దరూ కలిసి జీవిస్తూ, ఈ ఏడాది జనవరిలో పెళ్లి కూడా చేసుకున్నారని, ప్రస్తుతం వారికి రెండు నెలల బాబు ఉన్నాడని పోలీసులు తెలిపారు.
నిందితుల అరెస్ట్:
నిందితుడి ఒప్పుకోలుతో తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్మార్టం నిర్వహించారు. నిందితులు మోంటీ కుమార్ సింగ్ మరియు మైనర్ బాలికను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చాకచక్యంగా కేసును ఛేదించిన పోలీస్ అధికారులను డీసీపీ అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి