కాంగ్రెస్ది బాగు చేసే పని కాదు… చెడగొట్టే పని మాత్రమే!
కాంగ్రెస్ది బాగు చేసే పని కాదు… చెడగొట్టే పని మాత్రమే!
Biksham
పదేళ్ల అభివృద్ధిని రెండేళ్లలో ఆగం చేశారు
పట్టణాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బ్రహ్మరథం
సూర్యాపేటలో గులాబీ జెండా ఎగురడం ఖాయం
మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
సూర్యాపేట:
కాంగ్రెస్ పార్టీది రాష్ట్రాన్ని బాగు చేసే పని కాదని, ప్రజలు కష్టపడి సాధించుకున్న అభివృద్ధిని చెడగొట్టే పని మాత్రమేనని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సూర్యాపేట పట్టణంలోని పలు వార్డుల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు కొనియాడుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లలోనే ఆ అభివృద్ధిని ఆగం చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధితో పాటు పదేండ్లలో పెంచిన పచ్చదనాన్ని సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎండబెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయామని ప్రజలు ఇప్పుడు బలంగా అనుకుంటున్నారన్నారు. మోసపోతే గోసపడతామని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారని గుర్తు చేశారు. మరోసారి మోసపోకుండా ప్రజలు జాగ్రత్త పడాలని, మున్సిపల్ ఎన్నికల్లో అరాచక కాంగ్రెస్ను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. అభివృద్ధికి కేరాఫ్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు పట్టం కట్టాలని కోరారు. సూర్యాపేట మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు.
మిర్యాలగూడ సభలో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్తే అందరికీ జ్ఞానం పెరుగుతుందని, కానీ రేవంత్కు ఉన్న కాస్త జ్ఞానం కూడా పోయిందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడకుండా దిగజారి బూతులు వల్లెవేస్తున్నారని విమర్శించారు. సమస్యలపై మాట్లాడకుండా అర్థంలేని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.గాంధీలా ఆమరణ దీక్ష చేసి కేసీఆర్ తెలంగాణ తెచ్చారని, స్వాతంత్య్రం తెచ్చిన గాంధీతో పోల్చుతూ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను ప్రజలు జాతిపితగా భావిస్తున్నారన్నారు. రేవంత్ గతంలో చంద్రబాబు, నేడు సోనియా అంటూ, రేపు మోదీని కూడా జాతిపిత అంటాడేమోనని ఎద్దేవా చేశారు.సీఎంగా రెండేళ్లు గడిచినా సంస్కారహీనత పెరిగిపోతోందని, ప్రజా సమస్యలను పక్కనపెట్టి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సభల్లో రేవంత్ మాట్లాడే రోత మాటలే బీఆర్ఎస్కు మరింత బలాన్ని ఇస్తున్నాయని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి