Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 03:17 AM

జనాభా లెక్కలు జిల్లా అధికారులకు మూడు రోజుల శిక్షణ కలెక్టర్ అనురాగ్ జయంతి

జనాభా లెక్కలు జిల్లా అధికారులకు మూడు రోజుల శిక్షణ కలెక్టర్ అనురాగ్ జయంతి

జనాభా లెక్కలు జిల్లా అధికారులకు మూడు రోజుల శిక్షణ కలెక్టర్ అనురాగ్ జయంతి
March 15, 2026 04:23 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

యాదాద్రి భువనగిరి జిల్లాలో 2027 జనాభా గణన కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా, మండల స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, ప్రధాన జనాభా గణన అధికారి అనురాగ్ జయంతి ఆదివారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2027 జనాభా గణన దేశ అభివృద్ధికి ఎంతో కీలకమని అన్నారు. ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం అధికారులు పూర్తి అవగాహనతో క్షేత్రస్థాయిలో బాధ్యతగా పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో జనాభా గణనను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.

జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని చెప్పారు. మొదటి దశలో ఇళ్ల జాబితా, గృహాల గణన మే 11 నుంచి జూన్ 9 వరకు జరుగుతుందని, రెండో దశలో జనాభా గణన 2027 ఫిబ్రవరిలో నిర్వహిస్తామని వివరించారు.

ఈసారి జనాభా గణనను దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మొబైల్ అప్లికేషన్లు, వెబ్ పోర్టల్‌ల ద్వారా గణన ప్రక్రియను చేపడతామని చెప్పారు. ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.

మొదటి దశలో నిర్వహించే ఇళ్ల జాబితా, గృహాల గణనలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన పదార్థాలు, ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి సౌకర్యం, మురుగు నీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం వంటి అంశాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు వంటి గృహ సౌకర్యాలపై మొత్తం 34 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరిస్తారని తెలిపారు.

మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి అంశాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే నివృత్తి చేసుకోవాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి మరియు జిల్లా సెన్సస్ అధికారి వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపిడిఓలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News