తుంగతుర్తి;పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ను కలిపి విక్రయించడం వల్ల వాహనదారులు, వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ కలిపిన పెట్రోల్తో పాటు ఇథనాల్ రహిత పెట్రోల్ను కూడా వినియోగదారుల అభీష్టం మేరకు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు.చెరకు, మొక్కజొన్న, బియ్యం వంటి పంటల నుంచి ఇథనాల్ను తయారు చేస్తున్నారని, ఇథనాల్ కలపడం వల్ల వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గి మైలేజీపై ప్రభావం పడుతోందని సీతయ్య పేర్కొన్నారు.ఫలితంగా వాహనదారులు తరచూ పెట్రోల్ నింపించుకోవాల్సి రావడంతో అదనపు ఖర్చు భరించాల్సి వస్తోందన్నారు.వాహనాల పనితీరుపై కూడా ప్రభావం పడే అవకాశం ఉండటంతో నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు.
*నిత్యావసర ధరలతో పేదలపై భారం*
ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మూడోసారి అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో విఫలమైందని సీతయ్య విమర్శించారు. వంటగ్యాస్ ధరల పెంపుతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగిందన్నారు.అదేవిధంగా వ్యవసాయ రంగంలో ఉపయోగించే సంక్లిష్ట ఎరువుల ధరలు పెరగడంతో రైతులపై అదనపు భారం పడుతోందని తెలిపారు. కనీసం డీఏపీ ఎరువు సైతం సకాలంలో అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
*కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలే బుద్ధి చెబుతారు*
ఒకవైపు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న ధరలతో సామాన్య ప్రజలు ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని సీతయ్య ఆరోపించారు.ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తాటికొండ సీతయ్య అన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి