ఇంటర్లో ప్రతిభ చూపిన ప్రభుత్వ విద్యార్థులకు శుభాకాంక్షలు
ఇంటర్లో ప్రతిభ చూపిన ప్రభుత్వ విద్యార్థులకు శుభాకాంక్షలు
Biksham
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు.
సోమవారం కళాశాలలో మౌలిక వసతులపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్తో కలిసి ప్రిన్సిపాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలకు అవసరమైన నిధులు మంజూరు చేయించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.
తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, గదుల్లో విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, భవనాలు, బెంచీలు, ఫర్నీచర్ తదితర అవసరాల జాబితాను సిద్ధం చేసి అందజేయాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఉచితంగా నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్య అందుతుందని, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక లాబొరేటరీలతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో తాటి ఉదయశ్రీ 980/1000, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ ఎల్ఎండీటీ దరావత్ సరిత 984/1000, ప్రథమ సంవత్సరంలో బైపిసి జనగాం శ్రీకర్ 431/440, హెచ్ఈసీ అమతుల్ రకుల్ షరియా 465/500 మార్కులు సాధించడంతో ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పెరుమళ్ల యాదయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు కొనతం రాజేష్ రెడ్డి, కొండపల్లి దిలీప్ రెడ్డి, గుణగంటి హేమ సతీష్, లెక్చరర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి