కాలుష్యంపై భగ్గుమన్న గ్రామస్తులు.. బ్లూక్రాన్ కంపెనీ ముందు ధర్నా
కాలుష్యంపై భగ్గుమన్న గ్రామస్తులు.. బ్లూక్రాన్ కంపెనీ ముందు ధర్నా
Krishna
సంగారెడ్డి జిల్లా నందికంది గ్రామ సమీపంలోని బ్లూక్రాన్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ గ్రామ సర్పంచ్ మాచర్ల సరస్వతి విజయ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కంపెనీ ముందు ధర్నా నిర్వహించారు. గత కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో కంపెనీ నుంచి వెలువడుతున్న పొగ కారణంగా గ్రామంలోని ఇళ్లపై బూడిద పేరుకుపోతుండటంతో పాటు దుర్వాసన వ్యాపించి ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు, ఆహార పదార్థాలు కూడా కలుషితమవుతున్నాయని, కంపెనీ విడుదల చేస్తున్న వ్యర్థ జలాల వల్ల భూగర్భ జలాలు సైతం ప్రభావితమవుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు.ఈ సమస్యపై ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రాలేదని, కంపెనీపై జారీ చేసిన క్లోజింగ్ ఆర్డర్లను కూడా పట్టించుకోకుండా యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే జోక్యం చేసుకుని కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా సందర్భంగా కొంత ఉద్రిక్తత నెలకొనగా సదాశివపేట సీఐ వెంకటేశం జోక్యం చేసుకుని గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితిని శాంతింపజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆకుల శివరాం, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి