ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై పేరెంట్స్ ఆగ్రహం.డొనేషన్లు, టీసీలు, పుస్తకాల పేరుతో భారీ వసూళ్లు
ప్రైవేట్ స్కూళ్ల దోపిడీపై పేరెంట్స్ ఆగ్రహం.డొనేషన్లు, టీసీలు, పుస్తకాల పేరుతో భారీ వసూళ్లు
Editor Desk
నల్లగొండ టౌన్: జిల్లా కేంద్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల దోపిడీకి అడ్డాగా మారాయని పీడీఎస్యూ, పీవైఎల్, పేరెంట్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. డొనేషన్లు, అడ్మిషన్లు, టీసీలు, పుస్తకాల పేరుతో విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ అంశంపై సోమవారం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు పోలె పవన్, పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.వి.చారి, పేరెంట్స్ అసోసియేషన్ నాయకుడు బొమ్మిడి నగేష్ మాట్లాడుతూ.. విద్యను వ్యాపారంగా మార్చి ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అడ్మిషన్ సమయంలో డొనేషన్ పేరుతో భారీ మొత్తాలు వసూలు చేస్తుండగా, టీసీ ఇవ్వడానికి రూ.1,500 నుంచి రూ.3 వేల వరకు, అడ్మిన్ ఫీజు పేరుతో మరో రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
పుస్తకాల పేరిట పిండేస్తున్న భారం
నర్సరీ నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు పుస్తకాల కోసం రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. కొన్ని విద్యాసంస్థలు ప్రైవేట్ బుక్ స్టాల్స్తో ఒప్పందాలు చేసుకుని కమిషన్ల కోసం తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నాయని ఆరోపించారు. పుస్తకాలతో పాటు యూనిఫాంలు, షూస్, టైలు, బెల్టులు కూడా నిర్దిష్ట దుకాణాల్లోనే కొనాలని ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు.
చూస్తూ ఊరుకుంటున్న అధికార యంత్రాంగం
ఫీజుల దోపిడీపై పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవడంలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అధికార యంత్రాంగం మొద్దునిద్ర వీడి వెంటనే తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
లేకుంటే ఆందోళనే..
అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్న పాఠశాలలు, బుక్ స్టాల్స్పై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై కేసులు నమోదు చేయాలని కోరారు. డిమాండ్లు నెరవేర్చకపోతే జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో దాసరి నర్సింహా, రామకృష్ణ, అంబేద్కర్, ఐ.లోకేష్, శంకర్, డి.వెంకటేష్, ప్రభు, మధుసూదన్, రాజు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి