డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరి సహకారం అవసరం: కలెక్టర్ ప్రతీక్ జైన్
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరి సహకారం అవసరం: కలెక్టర్ ప్రతీక్ జైన్
Krishna
మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ముఖ్యంగా యువత డ్రగ్స్ మరియు ఇతర వ్యసనాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న “నషా ముక్త్ భారత్ సప్తాహ్–2026” కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో “నషా ముక్త్ భారత్ అభియాన్ – వికసిత్ భారత్ కి పహచాన్” పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా కుటుంబాలు, సమాజం మరియు దేశ అభివృద్ధికి కూడా తీవ్రమైన ముప్పుగా మారుతుందని అన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు, ఉపాధి అవకాశాలు మరియు సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు కలిసి అవగాహన కల్పించినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.జూన్ 17 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న “నషా ముక్త్ భారత్ సప్తాహ్–2026” ద్వారా మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, యువతను వ్యసనాలకు దూరంగా ఉంచడం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 14446 నేషనల్ డీ-అడిక్షన్ హెల్ప్లైన్ను అందుబాటులో ఉంచిందని, అవసరమైన వారు ఈ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలన ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించినప్పుడే డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా కలెక్టర్లు సంగీత, పాండు, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. లలితా దేవి, డీఆర్డీఓ జ్యోతి, జిల్లా పరిషత్ సీఈఓ జానకి రెడ్డి, ఆర్డీవో రాజేందర్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. యువత తమ జీవిత లక్ష్యాలను సాధిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పిలుపునిచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి