ప్రాణాలతో చెలగాటమా..? ఆవుదూడ వంకపై కొత్త వంతెన నిర్మించాలని సీపీఐ డిమాండ్
ప్రాణాలతో చెలగాటమా..? ఆవుదూడ వంకపై కొత్త వంతెన నిర్మించాలని సీపీఐ డిమాండ్
Editor Desk
సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్ష ప్రారంభం
ఆదోని: వేలాది మంది ప్రజలు, విద్యార్థులు నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్న ఆవుదూడ వంకపై వెంటనే నూతన వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. 17వ వార్డు పరిధిలోని ఆర్ఆర్ లేబర్ కాలనీ, సీఆర్ నగర్, అయ్యప్ప నగర్ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ దీక్షలను సీపీఐ పట్టణ కార్యదర్శి టి.వీరేష్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కల్లుబావి, శంకర్నగర్, వైఎస్సార్నగర్, భీమ్రెడ్డి నగర్, కోట్ల విజయభాస్కర్రెడ్డి నగర్, ఆర్ఆర్ లేబర్ కాలనీ, సీఆర్ నగర్, అయ్యప్ప నగర్ ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రజలు ప్రతిరోజూ ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారని తెలిపారు. దాదాపు 2 వేల మందికి పైగా విద్యార్థులు ఆర్ఆర్ లేబర్ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు ఈ మార్గాన్నే వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.
వర్షం వస్తే వణుకు..
వర్షాకాలంలో వంక ఉధృతంగా ప్రవహించే సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు ప్రాణభయంతో ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమన్నారు.
క్రీడా మైదానం ముళ్లకంపల మయం
ప్రాంతంలోని క్రీడా మైదానం పూర్తిగా ముళ్లకంపలతో నిండి నిరుపయోగంగా మారిందని తెలిపారు. యువత, విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్న పరిస్థితి ఏర్పడిందని, వెంటనే మైదానాన్ని శుభ్రపరచి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
మహిళలకు మరుగుదొడ్లు కావాలి
ఆర్ఆర్ లేబర్ కాలనీ, సీఆర్ నగర్, అయ్యప్ప నగర్ ప్రాంత మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు.
స్పందించకపోతే ఉద్యమం ఉధృతం
ప్రజల ప్రాణ రక్షణ కోసం ఆవుదూడ వంకపై నూతన వంతెన నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని, పెండింగ్ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
దీక్షా శిబిరంలో హనుమప్ప, కె.లింగప్ప, జి.అంజిత్ గౌడ్, కె.రమేష్ కుమార్, బి.శ్రీకాంత్, బి.గిరి తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి