నల్లగొండలో ఘోర విషాదం ఒకే ఇంట్లో కుళ్ళిన స్థితిలో నాలుగు మృతదేహాలు..
నల్లగొండలో ఘోర విషాదం ఒకే ఇంట్లో కుళ్ళిన స్థితిలో నాలుగు మృతదేహాలు..
NM Yadav
వినిపించిన అరుపులు కుటుంబ కలహాలే కారణమా?
నల్లగొండ : నల్లగొండ నగరంలో తీవ్ర కలకలం రేపిన ఘోర విషాదం వెలుగుచూసింది. స్థానిక తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహాలు పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో లభ్యమవ్వడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణం ఎస్ఎల్బీసీ రోడ్డులోని తెలంగాణ కాలనీలో నివాసముంటున్న మహమ్మద్ సుల్తాన్ (45) స్థానిక లెదర్ షాపులో పనిచేస్తుండగా, ఆయన భార్య హసీనా (40) ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి కుమారుడు ముజమ్మిల్ (20) ఏసీ రిపేరింగ్ వర్క్షాప్లో పనిచేస్తుండగా, కుమార్తె అప్సర (11) పాఠశాలలో చదువుతోంది.
దుర్వాసన రావడంతో వెలుగులోకి..
గత నాలుగు రోజులుగా ఈ ఇల్లు బయట నుంచి తాళం వేసి ఉంది. అయితే, సోమవారం ఉదయం నుంచి సదరు ఇంటి పరిసరాల నుంచి తీవ్రమైన దుర్వాసన రావడాన్ని గమనించిన పొరుగువారు స్థానిక కార్పొరేటర్కు సమాచారం అందించారు. కార్పొరేటర్ వెంటనే వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి బయట గేటు తాళాన్ని పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, ఒకేచోట నలుగురి మృతదేహాలు కుళ్ళిపోయి, పురుగులు పట్టిన స్థితిలో కనిపించాయి. మృతదేహాలు దారుణంగా రూపాంతరం చెందడాన్ని బట్టి చూస్తే.. వారు దాదాపు నాలుగు రోజుల క్రితమే మృతి చెంది ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
వినిపించిన అరుపులు.. కుటుంబ కలహాలే కారణమా?
ఇది హత్యనా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాలుగు రోజుల క్రితం సదరు ఇంట్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగినట్లు, తీవ్రమైన అరుపులు వినిపించాయని పొరుగు నివాసితులు పోలీసులకు వెల్లడించారు. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఇది సామూహిక ఆత్మహత్యా లేక ఎవరైనా హత్య చేసి బయట తాళం వేసి వెళ్లారా? అనే కోణంలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
త్వరలోనే కేసు మిస్టరీని ఛేదిస్తాం జిల్లా ఎస్పీ..
ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఇంట్లోని వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నాలుగు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కుళ్ళిపోయి ఉన్నాయని కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి గల అసలు కారణాలు స్పష్టమవుతాయని త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో తెలంగాణ కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి