ఇంటర్ ఫలితాల విషాదం: మూడు రోజుల్లో 13 మంది విద్యార్థుల బలవన్మరణం
ఇంటర్ ఫలితాల విషాదం: మూడు రోజుల్లో 13 మంది విద్యార్థుల బలవన్మరణం
Komidala Mahender reddy
ఫెయిల్ అయ్యామనే మానసిక ఒత్తిడితో ఆరుగురు విద్యార్థుల ఆత్మహత్యలు
కుటుంబాల్లో విషాద ఛాయలు.
రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు తీవ్ర విషాదానికి దారితీశాయి. పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయామనే మనస్తాపంతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత మూడు రోజుల్లోనే మొత్తం 13 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం విద్యా వ్యవస్థపై, పరీక్షల ఒత్తిడిపై మరింత చర్చకు దారి తీస్తోంది.
తాజాగా ఆరుగురు విద్యార్థులు ఫలితాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన సౌజన్య(17), సంగారెడ్డి జిల్లా మనూరు మండలం ఎన్.జీ. హంక్రాన్ గ్రామానికి చెందిన రమేష్(17), నాగల్గిద్ద మండలం కారముంగి గ్రామానికి చెందిన నందిని(17)లు ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారు.అలాగే నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామానికి చెందిన మణివర్ధన్, సిద్దిపేట జిల్లా రంగనాయకపురం గ్రామానికి చెందిన పొట్ల ప్రత్యూష(17), నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతానికి చెందిన భూక్యా ఆకాష్(18) కూడా ఇదే కారణంతో ప్రాణాలు తీసుకున్నారు.ఈ ఘటనలతో సంబంధిత గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది. తమ పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. చదువుల ఒత్తిడి, ఫలితాలపై ఉన్న అధిక ఆశలు విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థులు ఫలితాలను జీవితం మొత్తం అని భావించకూడదని, విఫలతలు విజయానికి మెట్లు అన్న భావన కల్పించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు మానసిక ధైర్యం ఇవ్వాలని, అవసరమైతే కౌన్సెలింగ్ అందించాలని కోరుతున్నారు.
ఈ వరుస ఘటనలు రాష్ట్రాన్ని కుదిపేస్తుండగా, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి