Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 07, 2026 07:36 PM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండించిన సిపిఎం ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సిపిఎం నాయకులు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండించిన సిపిఎం ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సిపిఎం నాయకులు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండించిన సిపిఎం  ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సిపిఎం నాయకులు
March 07, 2026 06:01 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు జరుపుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి తెలిపారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి సెంటర్‌లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మల్లు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ ఇరాన్‌పై అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయిల్ కలిసి దాడులు జరిపి వందలాది మంది సాధారణ పౌరులను హతమార్చడం అమానుషమని అన్నారు. వెంటనే యుద్ధాన్ని ఆపి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, ఇరాన్ దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘిస్తూ దాడులు జరపడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజం ఈ చర్యలను ఖండించి యుద్ధాన్ని నిలిపివేయడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

అమెరికా సామ్రాజ్యవాద ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, గతంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్, లిబియా నాయకుడు గడాఫీ వంటి నాయకులను కూడా ఇదే విధంగా హతమార్చిన ఘటనలను గుర్తు చేశారు. ఖనిజ సంపదలు, సహజ వనరులు, చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఇజ్రాయిల్‌తో కలిసి ఇరాన్‌పై దాడులకు పాల్పడుతున్నదని విమర్శించారు.

పాలస్తీనా ప్రాంతాన్ని ఇజ్రాయిల్, అమెరికా కలిసి స్మశానంగా మార్చాయని, ఇప్పుడు ఇరాన్‌పై దాడులు కొనసాగించడం ప్రపంచ శాంతికి ప్రమాదకరమని అన్నారు. తమ ప్రయోజనాల కోసం యుద్ధాలు చేసి సాధారణ ప్రజలను బలి తీసుకోవడం అన్యాయమని విమర్శించారు.

ఇరాన్ భారతదేశానికి ఎంతో కాలంగా మిత్రదేశమని, అటువంటి దేశంపై దాడులు జరిగినా భారత ప్రభుత్వం స్పందించకపోవడం తగదని అన్నారు. యుద్ధం కారణంగా పశ్చిమ ఆసియాలో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయుల ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు. దిగుమతులపై ధరలు పెరిగి దేశ ప్రజలపై ఆర్థిక భారం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య దేశాలు కలిసి యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేయాలని, భారత ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి అమెరికా, ఇజ్రాయిల్ చర్యలను ఖండించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, జె. నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, దండ వెంకటరెడ్డి, నాయకులు షేక్ జహంగీర్, బొమ్మిడి లక్ష్మినారాయణ, చిన్న పంగి నరసయ్య, నల్లమేకల అంజయ్య, మేరెడ్డి కృష్ణారెడ్డి, అవిరే అప్పయ్య, శ్రీకాంత్, చిత్రం భద్రమ్మ, మీరా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News