Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 02, 2026 05:52 PM

ఇరాన్ సార్వభౌమాధికారంపై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయ ఉగ్రవాదమే

ఇరాన్ సార్వభౌమాధికారంపై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయ ఉగ్రవాదమే

ఇరాన్ సార్వభౌమాధికారంపై అమెరికా–ఇజ్రాయెల్ దాడులు అంతర్జాతీయ ఉగ్రవాదమే
March 02, 2026 04:21 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ ఖండన

సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎం సి పి ఐ యు జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ ఇరాన్ దేశంపై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు జరిపిన దాడులను తీవ్రంగా ఖండించారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడులు అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఒక స్వతంత్ర దేశంపై, ఆ దేశ అత్యున్నత ప్రతినిధిపై ఇలాంటి దాడులు చేయడం అంతర్జాతీయ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కడమేనని అన్నారు. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, ముమ్మాటికీ అంతర్జాతీయ ఉగ్ర గుండాగిరి అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఈ దాడులు జరిపినట్లు చెబుతున్న వాదనలు అసత్యమని స్పష్టం చేశారు. మధ్యప్రాచ్య ప్రాంతంలో చమురు నిల్వలపై పట్టు సాధించడం, ఆయుధాల వ్యాపారాన్ని విస్తరించుకోవడం, తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడమే ప్రధాన ఉద్దేశ్యమని ఆరోపించారు. ఒక దేశాన్ని అస్థిరపరచడం సామ్రాజ్యవాద దురహంకారానికి నిదర్శనమని విమర్శించారు.

ఇరాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న మతపరమైన విధానాలు, మహిళలపై మరియు ప్రజలపై సాగుతున్న అణచివేతను ప్రజాస్వామ్యవాదులు, కమ్యూనిస్టులు ఖండిస్తారని చెప్పారు. అయితే అవి ఆ దేశ అంతర్గత విషయాలని, ఆ దేశ ప్రజలే తమ హక్కుల కోసం పోరాడాలని అన్నారు. ఆ నెపంతో పరాయి దేశాలు బాంబులు కురిపించడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని తెలిపారు. విదేశీ జోక్యం వల్ల ఇరాన్ ప్రజల కష్టాలు పెరుగుతాయే తప్ప తగ్గవని పేర్కొన్నారు. ప్రతి దేశానికీ తనను తాను పాలించుకునే సార్వభౌమాధికారం ఉందని అన్నారు. ఐక్యరాజ్యసమితి నిబంధనలను పక్కన పెట్టి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కొనసాగిస్తున్న హింసాత్మక చర్యలు భవిష్యత్తులో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇలాంటి ఏకపక్ష దాడులను ప్రపంచ దేశాలన్నీ ఖండించాలని పిలుపునిచ్చారు.

అంతర్జాతీయ వేదికలపై శాంతి సందేశాలు పలుకుతున్న భారత కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై మౌనంగా ఉండటం లేదా పరోక్ష మద్దతు ఇవ్వడం విచారకరమని అన్నారు. ఇది భారతదేశం అనుసరిస్తూ వచ్చిన అలీన విధానానికి విరుద్ధమని విమర్శించారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనైనా ఖండించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. దాడులను తక్షణమే నిలిపివేసి, దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలనీ, ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవించేలా ఐక్యరాజ్యసమితి వెంటనే జోక్యం చేసుకోవాలని ఎం సి పి ఐ యు సూర్యాపేట జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ప్రపంచ ప్రజలు విస్తృతంగా ఈ దాడులను వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News