గురుకుల సీఈటీ 2026–27కు నోటిఫికేషన్ విడుదల — సీట్లకు పోటెత్తే విద్యార్థులు
గురుకుల సీఈటీ 2026–27కు నోటిఫికేషన్ విడుదల — సీట్లకు పోటెత్తే విద్యార్థులు
స్థానికం బృందం
గురుకుల సీఈటీకి మరోసారి భారీ స్పందన
యాదాద్రి స్థానికం ప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియకు తెరలేచింది. గురుకుల సీఈటీ నోటిఫికేషన్కు సంబంధించిన పోస్టర్ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కరరావు, జిల్లా సమన్వయ అధికారి పోతంశెట్టి సుధాకర్ పాల్గొన్నారు.
ఐదో తరగతి ప్రవేశాలతో పాటు 6 నుంచి 9వ తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం అన్ని గురుకులాలకు కలిపి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి వచ్చే నెల 21 వరకు రూ.100 ఫీజుతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సెట్ కన్వీనర్, ఎస్సీ గురుకులాల కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 22 వరకు ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక ఫోన్ నంబర్తో ఒక అప్లికేషన్ మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థి ఫోటో బదులు ఇతరుల ఫోటో అప్లోడ్ చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అడ్మిషన్ల ఎంపికలో ఉమ్మడి జిల్లా విధానాన్ని అనుసరిస్తామని వెల్లడించారు.
సీట్ల వివరాల ప్రకారం…
ఎస్టీ గురుకులాల్లో 83 పాఠశాలలు – 6,640 సీట్లు,
బీసీ గురుకులాల్లో 294 పాఠశాలలు – 28,680 సీట్లు,
ఎస్సీ గురుకులాల్లో 235 పాఠశాలలు – 18,700 సీట్లు ఉన్నాయి.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతికి మొత్తం సుమారు 55 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
గత ఏడాది 1.60 లక్షల దరఖాస్తులు రావడం ద్వారా గురుకులాలపై ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది. ప్రతి ఏటా దరఖాస్తుదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఉచిత విద్య, వసతి, పుస్తకాలు, భోజనం, కాస్మెటిక్ ఛార్జీలు వంటి సదుపాయాలతో పాటు 90 శాతం పైగా ఫలితాలు నమోదవుతుండటమే దీనికి కారణంగా మారింది. అంతేకాదు ఎంసెట్, క్యాట్, ఐసెట్, ఐఐటీ జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ప్రైవేట్ కాలేజీలకు దీటుగా శిక్షణ అందిస్తుండటంతో గురుకులాలపై ఆదరణ మరింత పెరుగుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి