గ్రామీణ యువత స్వయం సమృద్ధి కోసమే ఉచిత నైపుణ్య శిక్షణ
గ్రామీణ యువత స్వయం సమృద్ధి కోసమే ఉచిత నైపుణ్య శిక్షణ
K.RAVI
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్. కిషోర్ రెడ్డి
చౌటుప్పల్లో మహిళలకు సర్టిఫికెట్ల పంపిణీ
గ్రామీణ ప్రాంత యువత ఆర్థికంగా స్థిరపడి, స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే ఉచితంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్లు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్. కిషోర్ రెడ్డి తెలిపారు. చౌటుప్పల్లో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ సౌజన్యంతో నిర్వహించిన టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు బుధవారం సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. స్థానిక పురపాలక చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ ఎన్. కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, 1995లో అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు దూరదృష్టితో గ్రామీణ యువతకు ఉపాధి మార్గాలు చూపాలని జలాల్పురం గ్రామంలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థను స్థాపించారని గుర్తుచేశారు.ప్రస్తుతం ఈ సంస్థలో 18 రకాల వృత్తి విద్యా కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.దూరప్రాంతాల నుండి వచ్చే వారి కోసం 400 మంది సామర్థ్యం గల హాస్టల్ సౌకర్యం కూడా ఉచితంగా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రతి కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి విద్య, నైపుణ్యాలు ఎంతో అవసరమన్నారు.
మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక వికాసం సాధిస్తే, కుటుంబంలో గౌరవంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆకాంక్షించారు.
నేను కూడా ఈ సంస్థ విద్యార్థినే: పురపాలక చైర్పర్సన్
"గ్రామీణ మహిళలు ఇటువంటి సువర్ణావకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. నేను కూడా గతంలో స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలోనే కంప్యూటర్ కోర్సులో శిక్షణ పొందాను. ఇక్కడ లభించే శిక్షణ ఎంతో నాణ్యమైనది. టైలరింగ్, ఎంబ్రాయిడరీ నేర్చుకున్న మహిళలు సొంతంగా రాణిస్తూ స్థిరపడాలి. మొగుదాల పావని రమేష్ గౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్.
చౌటుప్పల్ లయన్స్ క్లబ్ ట్రస్ట్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్ గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తిరందాసు జగన్నాథ్, లయన్స్ జోనల్ చైర్మన్ పోలోజు శ్రీనివాసచారి, కార్యదర్శి అతహర్ పాషా, కోశాధికారి సిలువేరు మంగయ్య, గోశిక కరుణాకర్, లయన్స్ క్లబ్ సభ్యులు, శిక్షణ ఇన్స్ట్రక్టర్ రుద్ర బాలభారతి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి