గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం
గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యం
Biksham
వేసవికి ముందే ప్రత్యేక నీటి సరఫరా డ్రైవ్ – జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
స్థానికం ప్రతినిధి
గ్రామాల్లో ప్రజలకు నిరంతరం సురక్షిత తాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యంగా ఫిబ్రవరి ఒకటి నుంచి ఇరవై వరకు ప్రత్యేక నీటి సరఫరాడ్రైవ్ చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, మిషన్ భగీరథ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రత్యేక డ్రైవ్లో భాగంగా గ్రామాల వారీగా బోర్లు, హ్యాండ్పంపులు, ఓవర్హెడ్ ట్యాంకులు, పైప్లైన్లను పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు. పనిచేయని మోటార్లు, లీకేజీలు, బ్రేక్డౌన్లను వెంటనే గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలన్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరచి క్లోరినేషన్ తప్పనిసరిగా చేయాలని, ట్యాంకుల చుట్టూ పరిశుభ్రత పాటించాలని తెలిపారు. అవసరమైన చోట అదనపు బోర్లు, ప్రత్యామ్నాయ నీటి వనరులు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
జల సేవల ఆకలనం ద్వారా ప్రజలకు అందుతున్న తాగునీటి సరఫరా పరిమాణం, నాణ్యత, నిరంతరతను పరిశీలించాలని తెలిపారు. గ్రామస్థాయిలో నీటి సరఫరా లోపాలు, అవసరాలను గుర్తించేందుకు విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీలను చురుకుగా పనిచేయించాలన్నారు. గుర్తించిన అంశాలను సంబంధిత డాష్బోర్డ్లో నమోదు చేయాలని సూచించారు.అంగన్వాడి భవనాల నిర్మాణానికి నిధులు రాని వివరాలను సమర్పించాలని, వన మహోత్సవం కార్యక్రమంలో లక్ష్యాన్ని చేరుకునేలా శాఖల వారీగా నాట్లు వేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు వ్యక్తిగత మరుగుదొడ్ల మంజూరు, కమ్యూనిటీ శానిటేషన్ పనులు, సామాజిక తనిఖీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలకు మంజూరైన భవనాల ప్రతిపాదనలు వెంటనే పంపించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కే సీతారామారావు, జడ్పీ సీఈవో శిరీష, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖల అధికారులు, ఎంపిడిఓలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి