గ్రమా పంచాయతీ కార్యదర్శుల బదిలీలలో ‘కౌన్సిలింగ్’ మాయాజాలం..
గ్రమా పంచాయతీ కార్యదర్శుల బదిలీలలో ‘కౌన్సిలింగ్’ మాయాజాలం..
NM Yadav
నల్గొండ జిల్లా పంచాయతీ కార్యదర్శుల తీవ్ర ఆందోళన.!
జీవో 38 నిబంధనలు గాలికి.. ‘సొంత’ రూల్స్తో కేటాయింపులు.?
తెరపైకి రాజకీయ సిఫార్సులు
బెదిరింపుల పర్వం..
ఉద్యమానికి కార్యదర్శుల సన్నద్ధం..
నల్గొండ : నల్గొండ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీల పర్వం కలకలం రేపుతోంది. షెడ్యూల్ ప్రకారం కౌన్సిలింగ్ నిర్వహించి, అంతా సవ్యంగానే జరిగిందని అధికారులు భావిస్తున్న తరుణంలో.. తెరవెనుక జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నిబంధనల ప్రకారం కౌన్సిలింగ్లో తాము ఎంచుకున్న గ్రామ పంచాయతీలను (GPs) మార్చాలంటూ కొందరు ఉన్నతాధికారులు సిబ్బందిపై ఫోన్ల ద్వారా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చినట్లు తెలుస్తోంది.
‘శివయ్య’ సాక్షిగా లొసుగులు పెద్ద యూనియన్కే పెద్దపీట.?
ఈ బదిలీల ప్రక్రియలో ముఖ్యంగా ‘శివయ్య నిలయం’గా పేరున్న ఒక ప్రధాన గ్రామ పంచాయతీ కేటాయింపు వ్యవహారం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఒక్క జీపీ విషయంలోనే కాకుండా మరికొన్ని చోట్ల కూడా నిబంధనలను తుంగలో తొక్కినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బదిలీల ప్రక్రియలో ఒక ప్రముఖ ఉద్యోగ యూనియన్కు జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా అనుకూలంగా వ్యవహరించిందని, చిన్న యూనియన్ల ప్రయోజనాలను, హక్కులను పూర్తిగా పక్కనబెట్టేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనియన్ నాయకులను మభ్యపెట్టి పరస్పర బదిలీల (Mutual Transfers) పేరుతో ఇష్టానుసారంగా కేటాయింపులు జరిపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బెదిరింపుల పర్వం భయాందోళనలో కార్యదర్శులు..
"మేము చెప్పిన జీపీని మాత్రమే మీరు తీసుకోవాలి లేదంటే మీ జీపీకే మేము వస్తాం జాగ్రత్త!" అంటూ కొందరు ఇతర వ్యక్తుల నుంచి తమకు నేరుగా బెదిరింపులు వచ్చాయని పలువురు పంచాయతీ కార్యదర్శులు అంతర్గతంగా వాపోతున్నారు. కౌన్సిలింగ్ హాల్లోనే కాకుండా బయట కూడా ఇలాంటి ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురవడంతో కార్యదర్శులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
జీవో 38 ఉల్లంఘనలు సొంత రూల్స్!
ప్రభుత్వం బదిలీల కోసం స్పష్టమైన మార్గదర్శకాలతో జారీ చేసిన (GO 38) నిబంధనలను జిల్లాలో యథేచ్ఛగా ఉల్లంఘించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అసలు ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే లేని “నెగిటివ్ మండలం ఇవ్వము” అనే సరికొత్త నిబంధనను స్థానిక అధికారులు తెరపైకి తెచ్చి అమలు చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. దీనికి తోడు, స్పౌజ్ కేసుల (Spouse Cases) తిరస్కరణపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. భార్యాభర్తలు ఉద్యోగులైన వారికి ఇచ్చే ఈ వెసులుబాటు కేవలం ఒకే జిల్లా పరిధిలో ఉన్నవారికే వర్తిస్తుందని చెప్తూ ఇతర జిల్లాల నుంచి వచ్చిన అర్హులైన దరఖాస్తులను నిబంధనలకు విరుద్ధంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. బదిలీల నిబంధనలపై పూర్తి అవగాహన లేకుండా, “నాకు తెలిసిందే ఫైనల్ నా నిర్ణయమే శాసనం” అన్న ధోరణితో జిల్లా ఉన్నతాధికారి వ్యవహరించడం వల్లే ఈ గందరగోళం నెలకొందనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
న్యాయం చేయకుంటే ఉద్యమమే.!
రాజకీయ నాయకుల సిఫార్సులు, పైస్థాయి ఒత్తిళ్లకు తలొగ్గి కౌన్సిలింగ్లో తాము చట్టబద్ధంగా ఎంచుకున్న జీపీలను మార్చితే ఊరుకునేది లేదని పంచాయతీ కార్యదర్శులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, ఉన్నత యంత్రాంగం స్పందించి ఈ బదిలీల ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాము ఎంచుకున్న స్థానాలను యథాతథంగా కేటాయించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని కార్యదర్శుల వర్గాలు హెచ్చరిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి